ధీరూభాయి అంబానీ స్కూల్కు బాంబు బెదిరింపు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంద్రా కుర్లా ప్రాంతంలో ఈ స్కూల్ ల్యాండ్లైన్ నెంబర్కు మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
స్కూల్లో టైం బాంబు పెట్టానని, స్కూల్ ను పేల్చేస్తానంటూ ఆ కాలర్ బెదిరించి ఫోన్ కట్ చేశాడు. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్కూల్లో తనిఖీలు చేశారు. అయితే, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

స్కూల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆగంతకుడి నుంచి వచ్చిన ఫోన్ ను ట్రేస్ చేస్తున్నామని, తర్వలోనే అతడ్ని పట్టుకుంటున్నామని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు రావడం గమనార్హం.
గత అక్టోబర్ నెలలో అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోన్న హర్ కిసాన్ దాస్ ఆస్పత్రికి ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అంతకుముందు 2020లోనూ అంబానీ నివాసం ఆంటిలియా వద్ద పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అంబానీ కుటుంబభద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.












Click it and Unblock the Notifications