కరుణానిధి ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన, 12 ఏళ్ల తర్వాత నెరవేరిన ఆయన కల!
Recommended Video
చెన్నై: కరుణానిధి ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం ప్రకటన చేశారు. 28వ తేదీన బీపీ, పల్స్ పడిపోవడంతో కరుణానిధి ఆసుపత్రిలో చేరారని తెలిపారు. అప్పటి నుంచి ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నామన్నారు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలన్నారు..
చదవండి: కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ, ఆసుపత్రిలో ఇలా (ఫోటోలు)
29వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఆయన కొంత ఇబ్బంది పడ్డారన్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. వయసురీత్యా ఆయనకు ఆసుపత్రిలోనే చికిత్స పొడిగించడం అవసరమని చెప్పారు. కరుణానిధి వైద్యానికి బాగా స్పందిస్తున్నారని కావేరీ ఆసుపత్రి ఈడీ అరవింద్ తెలిపారు. కాగా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనను ఆసుపత్రిలో పరామర్శించారు.
కరుణానిధి కల నెరవేరింది
కరుణానిధి కోరిక తీరింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన తన కోరిక నెరవేరిన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. మధురై ఆలయంలో బ్రాహ్మణేతర పూజారిని తమిళనాడు ప్రభుత్వం తొలిసారిగా నియమించింది. తమిళనాడు చరిత్రలోనే బ్రాహ్మణేతర వ్యక్తిని ఆలయ పూజారిగా నియమించడం ఇదే తొలిసారి.
పుష్కర కాలం తర్వాత కరుణ కోరిక నెరవేరింది
2006లో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ కులం వారైనా తగిన శిక్షణ పొందితే వారిని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాల్లో అర్చకులుగా నియమిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. 2007-2008లో అన్ని కులాల వారికి జూనియర్ ప్రీస్ట్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రతిపాదించి, ఇందుకోసం ఆరు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసింది. పన్నెండేళ్ల తర్వాత ఆయన కోరిక నెరవేరింది.
ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారమే
మదురైలోని తల్లాకులంలో ఎండోమెండ్స్ ఆధ్వర్వంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఇటీవల బ్రాహ్మణేతర వ్యక్తిని పూజారిగా నియమించారు. ఆయన 2007-08లో డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అర్చక శిక్షణ పొందిన 206 మంది బ్రాహ్మణేతరులలో ఒకరు. బ్రాహ్మణేతర అర్చకుడు ఉన్నాడని తెలిస్తే ఆలయానికి వచ్చే భక్తులు తగ్గిపోవచ్చన్న అనుమానాల కారణంగా అన్నాడీఎంకే ప్రభుత్వం ఆయన పేరును మాత్రం బయటపెట్టలేదని తెలుస్తోంది. అయితే ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే మూడు నెలల క్రితం కొత్త అర్చకుడి నియామకం జరిగినట్టు తోటి అర్చకులు తెలిపారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారమే ఆయనను నియమించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
సుప్రీం కోర్టు సమర్థన
ప్రభుత్వ దేవాలయాల్లో అన్ని కులాల వారిని పూజారులుగా నియమించాలని డీఎంకే గతంలో కూడా చెప్పింది. అంతకుముందు డీఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ దిశగా అడుగు వేసింది. కానీ నాడు సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2006లో మరోసారి డీఎంకే ప్రభుత్వం మరోసారి జారీ చేసిన ఉత్తర్వులను మాత్రం సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ తీర్పుపై కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత దాదాపు పుష్కరకాలానికి కరుణానిధి కోరిక నెరవేరి మధురై ఆలయంలో బ్రాహ్మణేతర పూజారి నియామకం ఇటీవల జరిగింది.