దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన.. ఒకరోజు ఆందోళన: ఐఎంఏ, కారణమిదే..
వైద్యులపై దాడుల ఘటనలను డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైద్యులపై దాడిని ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త నిరసనకు సిద్దమైంది. హింసకాండ నుంచి వైద్యులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకురాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనుంది.
అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, మెడికల్ స్టూడెంట్స్ నెట్ వర్క్, జూనియర్ డాక్టర్ నెట్ వర్క్(JDN)వంటి సంస్థలు నిరసనలో పాల్గొంటాయని ఐఎంఏ తెలిపింది. హాస్పిటల్స్ ను రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది.
శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే నిరసన కార్యక్రమంలో సుమారు 3.5 లక్షల మంది వైద్యులు పాల్గొంటారని ఐఎంఎ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెఎ జయలాల్ తెలిపారు. అత్యవసర సమయంలో వైద్యులు చేస్తున్న సేవలను గుర్తించాలని కోరారు. అలా కాక దాడులకు పాల్పడటం మంచి పద్దతి కాదన్నారు. ప్రాణాలకు తెగించి మరీ విధులను నిర్వహిస్తే ఇలా చేస్తారా అని తప్పుపట్టారు.
కరోనా వేళ వైద్యులు ప్రంట్ లైన్ వారియర్స్.. అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల వారిపై దాడులు జరగడం కలకలం రేపుతోంది. దీనిని ఐఎంఏ కూడా తీవ్రంగా పరిగణించింది. ఒకరోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భారీగా వైద్యులు/ సిబ్బంది పాల్గొంటారు. వారు ప్రభుత్వానికి తమ వాణిని వినిపించనున్నారు.
కరోనా కాలంలో వైద్యుల విధులు దైవంతో సమానం. చాలా చోట్ల వైద్యులు.. అధిక గంటలు పనిచేస్తున్నారు. చాలా మంది రోగులను నయం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సీరియస్ అయిన వారు మాత్రం దక్కడం లేదు. మిగతా కేసులు సమయాన్ని బట్టి కోలుకుంటున్నారు.