మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు: శివసేన, అయోధ్యలో రామమందిరంపై జోషి
ముంబై: మతపరమైన నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించిన విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకుండా ఉంటే మంచిదంటూ శివసేన కోర్టులకు సూచించింది. ముంబైలోని రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మండపాలను, ఉత్సవాలను నిషేధిస్తూ ఇటీవల బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శివసేన తన అధికార పత్రిక సామ్నాలో విమర్శలు చేసింది.
ఏదో ఒక స్వచ్చంధ సంస్ధ అభిప్రాయాన్ని తీసుకుని ప్రజల అభిప్రాయంగా కోర్టు ఎలా పరిగణిస్తుందని ధ్వజమెత్తింది. ఎలాంటి ఉత్సవాలు, పండుగలు లేనప్పుడు కూడా దేశ వ్యాప్తంగా వచ్చి పోయే జనాలతో ముంబై మహా నగరం సంవత్సరం ఏడాది అత్యంత రద్దీగా ఉంటుందని పేర్కొంది.
నగరానికి భారీగా వస్తున్న ఈ వలసలను కోర్టులు కట్టడి చేయగలవా అని ప్రశ్నించింది. కాబట్టి, మత నమ్మకాలకు సంబంధించి అంశాలలో జోక్యం చేసుకోవద్దని కోరింది. దీని వల్ల ముంబైలో గణేష్ ఉత్సవం, నవరాత్రి, దహీహండీ, శివ జయంతి లాంటి హిందువుల పండగల సంస్కృతి నాశనమవుతుందని సామ్నాలో ఘాటుగా స్పందించింది.
జాతీయ పండుగలను, ఉత్సవాలను నిషేధించడం అంటే ప్రజల్లోని స్పూర్తిని చంపేయడమేనని శివసేన అభిప్రాయపడింది. కోర్టులు ప్రజలందరికి న్యాయం జరిగేలా వ్యవహరించాలని సలహా ఇచ్చింది. ముఖ్యంగా కోర్టులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే అందరికీ బాగుంటుందని వ్యాఖ్యానించింది.
హైకోర్టులో హిందువులకు అనుకూలంగా తీర్పు: సురేశ్ భయ్యాజీ జోషి
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలన్న తన దృఢసంకల్పాన్ని వదులుకోలేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని కోరింది. హైకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన తరువాత ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, ఇప్పుడు న్యాయవ్యవస్థ పాత్ర కీలకమైందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి పేర్కొన్నారు.
అయితే సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ నెమ్మదిగా సాగుతోందని పేర్కొంటూ దీన్ని వేగవంతం చేయాలని ఆయన అన్నారు. రామమందిరం నిర్మాణం అంశంపై ఇప్పుడు ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం ఉందని తాము భావించడం లేదన్నారు. తరువాత ఏమవుతుందో చూస్తామని, అయితే ఈ అంశాన్ని మాత్రం తాము వదిలిపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్ సర్వోన్నత నిర్ణాయక, విధాన నిర్ణయాల రూపకల్పన సంస్థ అయిన ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ' మూడు రోజుల మేధోమథన సమావేశాలు ఆదివారం ఇక్కడ ముగిశాయి. ఈ సమావేశాలలో మూడోసారి ఆర్ఎస్ఎస్ ‘సర్కార్యవాహ్' (ప్రధాన కార్యదర్శి)గా ఎన్నికయిన జోషి ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్ వంటి దేశాలలో హింసను తట్టుకోలేక ఇక్కడికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారతీయ పౌరసత్వం ఇవ్వాలని గట్టిగా సూచించారు.
‘విదేశాలలో అణచివేత వల్ల పారిపోవడానికి హిందువులకు మరో దేశం లేదు. విదేశీ గడ్డపై అన్యాయానికి, అణచివేతకు గురైన హిందువులు ఇక్కడికి వస్తారు. వారిని అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత మన సమాజంపైన, మన ప్రభుత్వంపైన ఉంది. ఇలాంటి వారి కేసులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, వారిని ఆదుకోవాలి' అని జోషి అన్నారు.