అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, ప్రియాంక గాంధీకి ఈసీ నోటీసులు: ఎందుకంటే?
న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ (Himanta biswa sharma), కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)లకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 30న సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఇద్దరినీ ఆదేశించింది. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అక్టోబర్ 18న కవర్ధాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న హిమంత బిశ్వశర్మ.. ముస్లిం వర్గానికి చెందిన మంత్రి మహమ్మద్ అక్బర్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్బర్ను సాగనంపకపోతే కౌశల్య మాతకు జన్మనిచ్చిన ఈ నేల అపవిత్రమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా ప్రాంతానికి ఒక అక్బర్ వస్తే.. అతడు మరో వంద మంది అక్బర్లను తెస్తారని, అందుకే సాధ్యమైనంత త్వరగా అక్బర్ను సాగనంపాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మరోవైపు, రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో మోడీ గురించి అవాస్తవాలను ప్రచారం చేశారంటూ ఆ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎవరైనా వ్యక్తిని మతం పేరుతోగానీ, వ్యక్తిగతంగా గానీ దూషించడం ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని పేర్కొన్న ఎన్నికల సంఘం.. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రియాంక గాంధీకి నోటీసులు ఇచ్చింది.
కాగా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో మరోసారి తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. ఈసారి తప్పకుండా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది.












Click it and Unblock the Notifications