ఎల్గార్ పరిషద్ కేసు- స్టాన్ స్వామికి ఊరట-ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు హైకోర్టు ఓకే
మహారాష్ట్రలో ఎల్గార్ పరిషద్ కేసులో నిందితుడుగా ఉన్న స్టాన్ స్వామికి బోంబే హైకోర్టులో ఊరట లభించింది. పార్కిస్కన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన్ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. 84 ఏళ్ల స్వామిని కరోనా రోగుల మధ్య ఉంచి చికిత్స కూడా అందకుండా చేస్తున్నారని న్యాయవాది ఆరోపించారు. దీంతో ఆయన్ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు హైకోర్టు అంగీకరించింది.
ప్రస్తుతం మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న స్టాన్ స్వామికి 15 రోజుల పాటు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది. అంతకుముందు స్టాన్ స్వామి కేసును అత్యవసరంగా విచారించారంటూ ఆయన తరఫు సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయ్ పిటిషన్ దాఖలు చేశారు. స్టాన్ స్వామి పెట్టుకున్న మధ్యంతర బెయిల్పై అత్యవసర విచారణ జరపాలని ఆయన బోంబే హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు ఇవాళ ఈ కేసు విచారించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
వాస్తవానికి స్టాన్ స్వామిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు బోంబే హైకోర్టు ఈ నెల 21న ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం స్టాన్ స్వామి ఆరోగ్య పరిస్ధితి దృష్ట్యా ఆయన ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఇవాళ మరోసారి అత్యవసర విచారణ జరిపిన న్యాయస్ధానం.. ప్రైవేటు ఆస్పత్రికి పంపేందుకు అనుమతించింది. గతేడాది అక్టోబర్లో ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టైన స్వామిని ఇతర నిందితులతో కలిపి తలోజా జైల్లో ఉంచారు. అయితే అక్కడ పలువురు ఖైదీలు కరోనా బారిన పడటం, స్టాన్ స్వామి ఆరోగ్యం విషమిస్తుండటంతో బోంబే హైకోర్టు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు అంగీకరించింది.