మాజీ సీఎం మాంఝీ కూతురుపై కేసు:'రాజకీయ కుట్ర'
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీకి ఝలక్. మాంఝీ కూతురు సునయన దేవి పైన పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. సమాచారం మేరకు.. సునయన దేవి కోడలు గత రెండు రోజులుగా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఆ కోడలు తండ్రి... సునయనదేవి కుటుంబ సభ్యుల పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురిని సునయన దేవి కట్నం కోసం చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సునయన దేవితో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యుల పైన కేసు నమోదు చేశారు. అతను గయలోని డెల్గా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సునయన దేవి కోడలు తండ్రి అయిన రామ్ దేవ్ మాంఝీ... తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని, అత్తింటి వారు కట్నం కోసం హత్య చేసి ఉంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారని జిల్లా పోలీసు అధికారు చెబుతున్నారు.
తన కూతురును చంపేసి, ఆ విషయం తమకు చెప్పకుండానే దహనం చేసి ఉంటారని తండ్రి అనుమానిస్తున్నాడు. కాగా, సునయన తనయుడు విక్కీతో ఆమెకు 2008లో పెళ్లి జరిగింది. దీనిపై మాంఝీ పార్టీ అధికార ప్రతినిధి దనిష్ మాట్లాడుతూ... ఇది రాజకీయ కుట్ర అని, దళిత నేత పైన కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు.