వివాదాస్పదం: అధికారులతో స్టేజీపై లైంగిక వేధింపుల దోషి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో హర్యానా మాజీ డీజీపీ ఎస్పీఎస్ రాథోడ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. రెండు రోజుల క్రితం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంచకులలో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ఉన్నతాధికారులతో రాథోడ్ వేదికపై నిలబడడం విమర్శలకు దారితీసింది.
లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష అనుభవించారు రాథోడ్. పోలీస్ అధికార కార్యక్రమాలకు మాజీ హోదాలో కూడా హాజరుకాకూడదన్న ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినా వాటిని ఆయన ఉల్లంఘించారు. అధికారులు కూడా ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోకుండా వేదిక మీదకు ఆయన్ని ఆహ్వానించారు.
ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. నేరస్తులకు ప్రభుత్వం గౌరవిస్తోందా అని బాధితురాలిస్నేహితురాలు ఆరాధన గుప్తా ప్రశ్నించారు.బాధితురాలి తల్లి కూడ ఈ ఘటనను తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ ఘటన రాజ్యాంగాన్ని అవమానపర్చడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.డిజీపీగా ఉన్న సమయంలో తన కూతురి క్లాస్మేట్ అయిన 10వ, తరగతి విద్యార్థినిపై రాథోడ్ 1990లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు నమోదైంది.
ఈ కేసు విషయమై బాధితురాలు విషం తాగి 1993లో ఆత్మహత్యకు పాల్పడింది. మీడియాలో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ సమయంలోనే రాథోడ్ హర్యానా అదనపు డీజీగా బాధ్యతలను స్వీకరించారు. 19 ఏళ్ళ పాటు విచారణ సాగించిన సిబిఐ 2009లో రాథోడ్ను నిందితుడిగా తేల్చింది. డిజీపీగా ఆయనను తప్పించాలని కోర్టు తీర్పు చెప్పింది. రాథోడ్కు ఇచ్చిన గౌరవ పురస్కారాలను కూడ వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.