మేకప్లు వేసి అర్థరాత్రి వీడియోలు తీసేవారు: వెలుగులోకి నిత్యానంద స్వామీ లీలలు
అహ్మదాబాదు: పేరుకే స్వామిజీలు.. పేరుకే వారు నడిపే గురుకులాలు, ఆశ్రమాలు. కానీ కాస్త లోతుగా చూస్తే అక్కడ చదివే విద్యార్థులకు ముఖ్యంగా అమ్మాయిలకు నరకమే కనిపిస్తుంది. ఏదో మాయమాటలు చెప్పి అమ్మాయిలను లొంగదీసుకుంటారు. ఇలాంటి వార్తలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. తాజాగా వివాదాస్పద స్వామీజీ నిత్యానంద ఆశ్రమం నుంచి బయటపడ్డ ఓ బాలిక సంచలనమైన విషయాలను వెల్లడించింది.
స్వామీ నిత్యానంద జంప్ .. దేశం విడిచి పారిపోయారని గుజరాత్ పోలీసుల అనుమానం
ఆశ్రమంలో నరకయాతన అనుభవించాను
వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు చెందిన ఆశ్రమంలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని అక్కడి నుంచి బయటపడిన ఓ బాలిక తండ్రి జనార్ధన్ శర్మ చెప్పారు. బెంగళూరుకు చెందిన జనార్థన్ శర్మ బాలబాలికల సంక్షేమ కమిటీ వారి సహాయంతో నిత్యానంద ఆశ్రమంలో ఉన్న తన 15 ఏళ్ల బాలికను బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆ బాలిక పలు సంచలన నిజాలను చెప్పింది. నిత్యానంద గురుకులంలో తాను 2013లో చేరినట్లు చెప్పింది. ప్రారంభంలో సరదా యాక్టివిటీలు తమతో చేయించేవారని అయితే 2017 నుంచి ఆ ఆశ్రమం పూర్తిగా అవినీతిమయమైందని చెప్పింది బాలిక.
లక్షల్లో విరాళాలు సేకరించమని చెప్పేవారు
2017 నుంచి క్రమంగా ఆశ్రమం పూర్తిగా డబ్బుమయంగా మారిందని చెప్పిన బాలిక... స్వామిజీ కోసం ప్రమోషనల్ కార్యక్రమాలు చేయాల్సి వచ్చేదని, తద్వారా విరాళాలు సేకరించాల్సి వచ్చేదని చెప్పుకొచ్చింది. అది కూడా వేలల్లో కాదని లక్షల్లో మాత్రమే టార్గెట్ ఇచ్చేవారని బాధను వ్యక్తం చేసింది. విరాళాలు రూ. 3 లక్షల నుంచి రూ.8కోట్లు వరకు ఉంటుందని చెప్పింది. విరాళాల రూపంలో అయితే డబ్బులు లేకుంటే ఎకరాల లెక్కన భూమిని తీసుకురావాల్సిందిగా తమకు చెప్పేవారని వెల్లడించింది.
అర్థరాత్రి వీడియోలు తీసేవారు
ఇక అర్థరాత్రి సమయంలో నిద్రలేపి స్వామీజీ కోసం వీడియోలు చేయాల్సిందిగా చెప్పేవారని ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. నగలు, మేకప్ వేసుకుని షూట్ కోసం కెమెరా ముందు నిలబడాల్సి వచ్చేదని చెబుతూ కన్నీరుమున్నీరైంది. ఇంకా తన సోదరి అక్కడే ఉందని ఆమె ఆ నరకకూపం నుంచి బయటపడలేదని చెప్పుకొచ్చింది. తన సోదరితో వీడియోలు చేయించాలని స్వయంగా నిత్యానంద స్వామీజీనే పురమాయించేవాడని బాలిక చెప్పింది. అంతేకాదు తన తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడాలని బలవంతం చేసేవారని అలా మాట్లాడి ఆశ్రమంలో స్వామీజీ ఎంత బాగ చూసుకుంటున్నాడో బయట ప్రపంచానికి కలరింగ్ ఇచ్చేవారని బాలిక వివరించింది. అయితే వారి మాటలకు తాను తలొగ్గలేదని చెప్పింది.
రెండు నెలలు బంధీ చేశారు
ఇక వారి మాటలు వినకపోవడంతో తనను రెండు నెలలుగా ఒక గదిలో పెట్టి తాళం వేశారని వెల్లడించారు. ఆమెను కొన్ని దుష్టశక్తులు ఆవహించాయని అందరికీ చెప్పారని ఆ బాలిక కన్నీరు మున్నీరు అయ్యింది. ఆశ్రమంలో చెడ్డమాటలు మాట్లాడేవారని వెల్లడించింది. ఇదిలా ఉంటే స్వామీజీ ఆశ్రమంలో తన కూతురును బంధించారని తండ్రి శర్మ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు.