రూ.లక్ష పెట్టి కొంటే.. ఇంజెక్షన్లో మందు కాదు నీళ్లు! నకిలీ క్యాన్సర్ డ్రగ్స్ గుట్టురట్టు!!
క్యాన్సర్ వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న బాధితుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఓ గ్యాంగ్ దారుణమైన మోసానికి పాల్పడింది. మార్కెట్లో ఒక్కోటి రూ. లక్ష వరకు విక్రయిస్తున్న 'అవెలుమాబ్' అనే క్యాన్సర్ ఇంజెక్షన్లలో కేవలం నీటిని మాత్రమే నింపి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ నిర్వహించిన దర్యాప్తులో తేలింది. జర్మనె మెర్క్ ల్యాబ్స్ ఈ ఔషధాలను పరీక్షించగా.. అందులో క్యాన్సర్ కణాలతో పోరాడే ఎలాంటి అసలు పదార్థం లేదని స్పష్టమైంది.అంతేకాకుండా రాజస్థాన్ ప్రభుత్వ పథకం కింద ఉచితంగా అందాల్సిన మందులను కూడా దొంగిలించి బయట విక్రయిస్తున్నట్లు తెలిసింది.
ఏడు రాష్ట్రాలకు విస్తరించిన రూ.9 కోట్ల నెట్వర్క్
ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి 7 రాష్ట్రాలకు ఈ నెట్వర్క్ విస్తరించింది. ఆగస్టు 20న క్రైమ్ బ్రాంచ్ నిర్వహించి మెరుపు దాడుల్లో ఈ దందా గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 17 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోదాల్లో భాగంగా 588 నింపిన నకిలీ వయల్స్, ఖాళీ బాటిళ్లు, 3,021 రకాల ఇతర మందులతో పాటు రూ.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డార్జాలెక్స్, ఇమ్ఫింజి, ఎర్బిటక్స్, ఓప్డైటా, కీట్రుడా వంటి అత్యంత ఖరీదైన క్యాన్సర్ ఔషధాల పేరిట ఈ మోసం సాగింది.

సిండికేట్కు డ్రగ్స్ ఎలా చేరాయి?
పోలీసుల వెల్లడించినన వివరాల ప్రకారం.. ఈ సిండికేట్కు మూడు మార్గాల ద్వారా మత్తుపదార్థాలు చేరాయి. మొదటిది అక్రమ మార్గాల ద్వారా కొనుగోలు చేసిన నకిలీ మందులు. రెండోది ఆసుపత్రులలో క్యాన్సర్ రోగుల కోసం ఉద్దేశించిన మందులను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం. మూడోది ప్రభుత్వ సంస్థలు, గిడ్డంగుల నుంచి ప్రభుత్వం సరఫరా చేసిన మందులను తరలించడం. ఈ మందులను చెల్లుబాటు అయ్యే బిల్లులు, కొనుగోలు రికార్డులు, డ్రగ్ లైసెన్సులు లేదా ఇతర అవసరమైన పత్రాలు లేకుండా ఇళ్లలో, ఇతర ప్రదేశాలలో నిల్వ ఉంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత వాటిని మధ్యవర్తుల ద్వారా మరింతగా సరఫరా చేశారు.
కెమికల్స్ తో పాత ప్యాకేజింగ్ రీసైక్లింగ్
ఉపయోగించిన అసలు బాటిళ్లు, ప్యాకింగ్ బాక్సులను సేకరించి ఎసిటోన్ వంటి రసాయనాలతో పాత బ్యాచ్ నంబర్లు ఎంఆర్పీ ధరకు సంబంధించిన వివరాలను చెరిపేసేవారు. ఆ తర్వాత మళ్లీ కొత్తగా కవర్లు, బబుల్ ర్యాప్లతో కొత్త ప్యాకేజింగ్ సిద్ధం చేసి అసలైన మందులుగా మార్కెట్లోకి వదిలేవారు.
ముఠాలో కీలక సూత్రధారులు వీరే..
లక్ష్మీ నగర్ కు చెందిన అభిషేక్ వైష్, శుభం కుమార్ చౌదరి, సూరజ్ చౌదరిలు ఈ దందాలో కీలక పాత్ర పోషించారు. అభిషేక్ 2022 నుంచే ఈ అక్రమ వ్యాపారం నడుపుతున్నట్లు తెలిసింది. వీరే కాకుండా నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హైదరాబాద్ కు చెంది పలువురు మెడికల్ సప్లయర్లు, ఆస్పత్రి సిబ్బంది కూడా ఈ సిండికేట్లో భాగమైనట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. క్యాన్సర్ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ మొత్తం వ్యవస్థ మూలాలను బయటకు తీసేందుకు దర్యాప్తు జరుపుతోంది.













Click it and Unblock the Notifications