రైతు ఉద్యమంలో మరో విషాదం -ఢిల్లీ సరిహద్దులో చెట్టుకు ఉరేసుకున్న రైతు -కేంద్రం తీరుపై విరక్తి
కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారుల్లో రైతులు కొనసాగిస్తోన్న ఉద్యమంలో మరో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా నిరసనల్లో పాలుపంచుకుంటోన్న ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైతుల పోరాటంపై కేంద్రం అనుసరిస్తోన్న తీరుతో విరక్తి చెందానంటూ సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు..
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి రైతులు వేలాదిగా తరలివచ్చి.. ఢిల్లీ-హర్యా నా సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ఘాజీపూర్, హర్యానా-రాజస్థాన్ సరిహద్దు షాజహాన్పూర్ వద్ద రెండున్నర నెలలుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. టిక్రీ సరిహద్దులోని రైతుల దీక్షా స్థలానికి కొంత దూరంలో 52 ఏళ్ల రైతు చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించిన దృశ్యాలు కలకలం రేపాయి..
ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -భారత్పై విదేశీ కుట్రలకు ఆధారాలు -తేయాకుపైనా పన్నాగం
చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు చెబుతోన్న ఆ రైతును హర్యానాలోని జిండ్ తాలూకాకు చెందిన కరమ్వీర్ సింగ్ గా గుర్తించారు. సంఘటనా స్థలంలో ఆత్మహత్య లేఖ కూడా లభించిందని అధికారులు చెప్పారు. సదరు రైతు చేతితో రాసిందిగా భావిస్తున్న ఆ లేఖలో.. రైతులతో చర్చల విషయంలో మోదీ సర్కారు అలసత్వంగా వ్యవహరిస్తోందని, చర్చల తేదీలు పొడిగిస్తోందని, వ్యవసాయ చట్టాలు నిజంగా ఎప్పుడు రద్దవుతాయో ఎవరికీ తెలీదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా,
హౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దు
మూడు వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ.. వేలాదిగా రైతులు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 74వ రోజుకు చేరాయి. గడిచిన రెండున్నర నెలల్లో నిరసనల్లో పాలుపంచుకున్న రైతుల్లో వివిధ కారణాలతో సుమారు 200 మంది చనిపోయారని సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ సంఖ్యతో విభేదిస్తోంది.