రైతు చట్టాల రద్దులో కీలకంగా విపక్షం-పార్లమెంటు నుంచి వీధుల దాకా-నిజమైన రాహుల్ జోస్యం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రాబోయే పార్లమెటు సమావేశాల్లో రద్దు చేస్తామని ప్రధాని మోడీ తాజాగా ప్రకటించారు. దీనిపై రైతుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతున్నా అనుమానాలు కూడా లేకపోలేదు. దీంతో చట్టాలు రద్దయిన తర్వాతే ఆందోళనలు విరమించి ఇళ్లకెళ్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులతో పాటు ఏడాది కాలంగా వీరి నిరసనల్ని పార్లమెంటు నుంచి వీధుల వరకూ తీసుకెళ్లిన విపక్షాల పాత్రపైనా చర్చ జరుగుతోంది.
నల్ల చట్లాలపై పోరు
రైతుల మేలు కోసమంటూ కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై విపక్షాలతో పాటు రైతు సంఘాలు అలుపెరగని పోరు సాగించాయి. ముఖ్యంగా రైతు చట్టాల్ని రద్దు చేసే వరకూ విశ్రమించబోమని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో భీష్మించుకుని కూర్చుంటే వారికి మద్దతుగా పార్లమెంటు నుంచి వీధుల వరకూ పోరాటాన్ని సాగించిన చరిత్ర విపక్షాలది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాందీ, ప్రియాంక వంంటి వారు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా క్షేత్రస్ధాయిలో పోరాటాన్ని ముందుకు నడిపించారు. వీరికి మిగతా విపక్షాలు కూడా తోడవడంతో బీజేపీకి తాజాగా భారీగా ఎదురుదెబ్బలు తాకడం మొదలైంది. రైతు ఉద్యమాన్ని విపక్షాలు మోయకపోతే మాత్రం బీజేపీ లైట్ తీసుకుని వదిలేసిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
పంజాబ్ లో రాహుల్, యూపీలో ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ యువ నేతలు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ వాద్రా రైతుల పోరాటాన్ని క్షేత్రస్ధాయిలో బాగా ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా పంజాబ్ లో పోరాటాన్ని రాహుల్ గాంధీ మోస్తే, ప్రియాంక గాంధీ యూపీలో పోరాటం సాగించారు. పంజాబ్ లో గతేడాది మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ కిసాన్ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించేవరకూ పోరాటం సాగుతుందని ప్రకటించారు. అలాగే ప్రియాంక గాంధీ యూపీలో వరుసగా మహా పంచాయత్ లు నిర్వహిస్తూ క్షేత్రస్ధాయిలో రైతుల్ని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కూడగట్టారు.
తెరపైకి విపక్షాల ఐక్యత
వ్యవసాయ చట్టాల అమలుపై ఏడాది పొడవునా సాగిన ప్రతిష్టంభనలో ఐక్య ప్రతిపక్షం కనిపించింది. అధికారంలో లేకపోయినా రైతుల కలిసి నిరసనల్ని కదం తొక్కించడంలో విపక్షాలు ఐక్యంగా వ్యవహరించాయి. విపక్ష పాలిత రాష్ట్రాలు ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ అసెంబ్లీలలో తీర్మానాలను ఆమోదించాయి. అలాగే పార్లమెంటులో ఈ అంశాన్ని వరుసగా లేవనెత్తడం ద్వారా ఎన్డీయే సర్కార్ కు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో లోక్సభ, రాజ్యసభల సంయుక్త సమావేశాల్లో రాష్ట్రపతి సంప్రదాయ ప్రసంగాన్ని బహిష్కరించడంతో సహా న్యాయ పోరాటంలో పాల్గొనడం వరకూ విపక్షాలు అరుదైన ఐక్యతను ప్రదర్శించాయి. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ఢిల్లీ మరియు ఉత్తరాది రాష్ట్రాలకు మించి వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకతను వ్యాప్తి చేయడంలో తమ వంతు పాత్ర పోషించాయి. - తమిళనాడులో డిఎంకె, పశ్చిమ బెంగాల్లో టిఎంసి, కేరళలో వామపక్షాలు, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీహార్లో ఆర్జెడి ఈ పోరులో ముందున్నాయి.
రాహుల్ మాటలే నిజమయ్యాయా ?
వాస్తవానికి, జనవరి 14న కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోవలసి వస్తుందని రాహుల్ చేసిన వ్యాఖ్య, శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాహుల్ వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో క్లిప్ తమిళనాడులోని మధురైలో సర్కులేట్ అవుతోంది. ఇందులో రాహుల్ రైతులు చేస్తున్న పనికి నేను చాలా గర్వపడుతున్నాను. నేను రైతులకు పూర్తి మద్దతు ఇస్తాను, వారికి అండగా ఉంటాను. నా మాటలను గుర్తుంచుకోండి ఈ (వ్యవసాయ) చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవలసి వస్తుంది, నేను చెప్పినది గుర్తుంచుకో, "అని అన్న మాటలే నిజం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.