రైతుల ఆందోళనకు చెక్ పెట్టేందుకు పోలీసులు రెడీ: కదిలేది లేదంటూ రైతు సంఘాలు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు ఉత్తరప్రదేశ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఘాజిపూర్ వద్ద ఆందోళన విరమించి రోడ్లను ఖాళీ చేయాలని ఘజియాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం ఈ రాత్రి వరకు గడువు విధించారు. ఒక వేళ రైతులు ఖాళీ చేయకపోతే తామే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా చేసినట్లు తెలిసింది.
గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళనకారుల దాడిలో 300 మందికిపైగా పోలీసులు గాయపడగా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరిగిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రైతుల ఆందోళనల పట్ల యూపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. నవంబర్ 26 నుంచి ఘజీపూర్ సరిహద్దును మూసివేశారు. అయితే, రైతులు మంగళవారం రోజున బారికేడ్లను ధ్వంసం చేసి ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. కాగా, జాతీయ రహదారుల పనులు పెండింగ్లో ఉండటంతో నేషనల్ హైవేస్ అథారిటీ నుంచి తమకు అభ్యర్థనలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇది ఇలావుంటే, 60 రోజులుగా రహదారులపై ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల నుంచి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సింఘా సరిహద్దులో ఆందోళనకు దిగిన స్థానికులు.. రైతులు ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని తేల్చి చెప్పారు. ఓ వైపు రైతులు, మరోవైపు స్థానికులు ఆందోళనలతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Recommended Video
కాగా, వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళనలను విరమించేది లేదని రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. బలవంతంగా ఖాళీ చేస్తే ఉరేసుకుంటానని హెచ్చరించారు. పోలీసులు రైతులకు గురువారం రాత్రి వరకే గడువు ఇవ్వడంతో ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.