రైతుల ఉద్యమం ఉధృతమైనా, హింసాత్మకంగా మారినా సరే .. సాగు చట్టాలపై కేంద్రం తీరులో నో చేంజ్; వాట్ నెక్స్ట్ !!
దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అన్నదాతల ఆందోళన దాదాపు సంవత్సర కాలం పూర్తి కావస్తుంది. అయినా కేంద్రం మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో లేదు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చెయ్యని ఆందోళన లేదు. సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం మేరకు వ్యవసాయాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ ఢిల్లీ సరిహద్దుల్లో నినదిస్తున్నారు.
కేంద్రంతో చర్చలు ఫెయిల్ ... ఆందోళన సాగిస్తున్న అన్నదాతలు
ఇంతకాలంగా అన్నదాతలు వివిధ రూపాల్లో తమ ఆందోళన కొనసాగించినా, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో కాంక్రీటు నిర్మాణాలు చేపట్టి మరీ, అక్కడే తిష్టవేసి నిరసన వ్యక్తం చేసినా, మూడు నల్ల చట్టాల రద్దు కోసం డిమాండ్ చేస్తూ ఆందోళనలను ఉధృతం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం తీరులో మాత్రం ఎలాంటి చలనం లేదు. మొదట చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పిన కేంద్రం, అనేక దఫాలుగా జరిగిన చర్చలు ఫెయిల్ కావడంతో చర్చల ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.
కిసాన్ పరేడ్, లఖింపూర్ ఖేరి ఘటనతో రైతుల ఉద్యమంలో విషాదం
జనవరి 26న కిసాన్ పెరేడ్ నేపథ్యంలో చెలరేగిన హింస ఢిల్లీ ఎర్రకోటపై రైతుల జెండాను ఎగరవేసే క్రమంలో, పోలీసులపై చెలరేగిన దాడులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మొన్నటికి మొన్న జరిగిన లఖింపూర్ ఖేరి ఘటన రైతుల ఆందోళన నేపథ్యంలోనే జరిగింది. ఇంత దారుణ ఘటనలు జరిగిన తర్వాత కూడా రైతులు ఉద్యమంపై స్పందించని కేంద్ర ప్రభుత్వం ఇకముందు స్పందిస్తుందా అంటే అనుమానమే అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
మరోమారు ఉద్యమాన్ని ఉధృతం చేసే ఆలోచన
ఇక ఇలాంటి సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ మరోమారు ఉద్యమాన్ని విస్తృతంగా కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ 22 వ తేదీన మహా పంచాయత్ నిర్వహించాలని, నవంబరు 29వ తేదీ నుండి ప్రతి రోజు పార్లమెంటుకు ట్రాక్టర్ల మార్చ్ నిర్వహించాలని ఆందోళనను ఉధృతం చేయడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందిస్తుంది అన్న ఆశాభావం రైతుల్లో క్రమంగా చచ్చిపోతోంది.
మూడు సాగు చట్టాల శవపేటికకు ఆఖరి మేకుగా కిసాన్ మహా పంచాయత్
కేంద్రం తీరుతో తీవ్ర అసహనంలో ఉన్న రైతులు ప్రభుత్వంపై యుద్ధాన్ని మరింత పెంచాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నవంబరు 22వ తేదీన లక్నోలో నిర్వహించబోయే మహా పంచాయత్ రైతు వ్యతిరేక ప్రభుత్వానికి చెంపపెట్టు కాబోతుందని, చారిత్రాత్మకంగా మారుతుందని, మూడు సాగు చట్టాల శవపేటికకు ఆఖరి మేకుగా నిరూపితమవుతుందని రాకేష్ టికాయత్ తేల్చి చెబుతున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలోనే అనేక దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి.
అనేక రకాలుగా రైతుల ఉద్యమాలు.. రోజుకో కొత్త ప్లాన్ లు .. అయినా స్పందనేది ?
నవంబర్ 22న లక్నోలో జరిగే కిసాన్ మహాపంచాయత్ "చారిత్రాత్మకం" అని టికాయత్ వంటి నేతలు చెబుతుండడంతో కిసాన్ మహా పంచాయత్ ద్వారా రైతులు ఏం చేయబోతున్నారో అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. నిరసన ప్రదేశాల్లో రైతుల టెంట్లను ప్రభుత్వం తీసివేస్తే, పోలీసు స్టేషన్లు మరియు జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాల వద్ద టెంట్లు వేస్తామని చెప్పిన రాకేష్ టికాయత్, ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యం మార్కెట్ లుగా మారుస్తామని హెచ్చరిక జారీ చేశారు.
తాజా రైతు సంఘం నాయకుల ప్రకటనలతో ఉత్కంఠ.. ఏం జరుగుతుందో ?
గత సంవత్సరం నవంబర్ 26 నుండి రైతులు వివిధ ప్రదేశాలలో మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. దాదాపు సంవత్సర కాలం అవుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రైతులు డిమాండ్ చేస్తున్న వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ఆలోచన లేదు. ఇక రైతులను ఆందోళనను విరమించే ఉద్దేశం లేదు. కొనసాగించేందుకు ఓపిక లేదు. ఈ క్రమంలో ముందు ముందు రైతుల ఉద్యమం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక రైతు సంఘం నాయకులు చేస్తున్న ప్రకటనలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి.