రైతు నిరసనలు: ఢిల్లీ సరిహద్దులు మూసివేత... ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
ఢిల్లీ: ఢిల్లీలో ట్రాఫిక్ మళ్లింపుపై దృష్టి సారించారు అక్కడి పోలీసులు. ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపడుతున్నారు. అయితే ఢిల్లీలోకి ప్రవేశ మార్గంగా ఉన్న అన్ని ప్రధాన రహదారులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. ఉత్తర్ ప్రదేశ్లోని ఇందిరాపురం, ఘజియాబాద్, మీరట్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లే వారు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ పోలీసులు ఈ మార్గాల నుంచి వచ్చే వాహనాలపై ఆంక్షలు విధించడం.. అదే సమయంలో ప్రధాన మార్గాలు మూసివేయడంతో ఈ మార్గంలో వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఢిల్లీ-యూపీ సరిహద్దులో రైతులు నిరసన చేపడుతుండటంతో ఈ మార్గాలను మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఘజియాబాదు జాతీయ రహదారి 24ను మాత్రమే పోలీసులు తెరిచి ఉంచారు. ఇక్కడ వాహనాలు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇతర దారులన్నీ పూర్తిగా మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రైతులు చేపడుతున్న నిరసనలు గురువారంతో 139వ తేదీకి చేరుకున్నాయి. ఇక యూపీ ఢిల్లీ సరిహద్దును పోలీసులు మూసివేయగా... హర్యానా నుంచి ఢిల్లీకి కనెక్ట్ చేసే సింఘూ, టిక్రి, హరేవాలి, ముంగేష్పూర్ సరిహద్దులను కూడా పోలీసులు మూసివేయడం జరిగింది.
ఘజియాబాదు, మీరట్ ఉత్తర్ ప్రదేశ్లోని ఇతర ప్రాంతాలు, ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి చేరుకోవాలని భావిస్తున్న వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మార్గాలన్నిటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అంటే అప్సర, భోప్రా, లోని, సూర్యనగర్, ఆనంద్ విహార్, కౌశంబి,మరియు కొండ్లి సరిహద్దుల మీదుగా ఢిల్లీకి చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ మరలించడంతో ఈ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువైంది. ముఖ్యంగా ఉదయకాలం మరియు రాత్రి వేళల్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు తెలిపారు పోలీసులు.