లవ్ అఫైర్: తండ్రే కన్నకూతుర్ని చంపి పూడ్చిపెట్టాడు
ముజఫర్నగర్: కన్న తండ్రే కూతురిని హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టాడు. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందనే ఆగ్రహంతో అతను 19 ఏళ్ల తన కూతురిని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్లో శుక్రవారంనాడు చోటు చేసుకుంది.
తమ గ్రామానికి చెందిన దళిత యువకుడితో సంబంధాన్ని ఇష్టపడని హసన్ అనే అనే వ్యక్తి తన కూతురు రుక్షర్ను హత్య చేశాడు. దళిత యువకుడితో సంబంధాన్ని తెంచుకోవడానికి అమ్మాయి ఇష్టపడలేదని, దీంతో తీవ్రమైన ఆగ్రహానికి గురైన హసన్ ఆమెను హత్య చేశాడని పోలీసులు చెప్పారు. చంపిన తర్వాత శవాన్ని శ్మశానవాటికలో పూడ్చి పెట్టాడు.
ఆ సంఘటన గురించి సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. హసన్తో పాటు మరో వ్యక్తి అమ్మాయిని హత్య చేసినట్లు సెక్యూరిటీ గార్డుతో పాటు హసన్ భార్య పోలీసులకు చెప్పారు. తాను కూతురిని చంపలేదని అంటూ శవాన్ని శ్మశానవాటిలో పూడ్చిపెట్టిన విషయాన్ని హసన్ అంగీకరించాడు.
దళిత యువకుడితో రుక్షర్ సంబంధాలు పెట్టుకుందనే విషయం గ్రామమంతటికీ తెలుసునని, దాంతో నలుగురైదుగురు కలిసి రుక్షర్ను చంపారని హసన్ వాదిస్తున్నాడు. రుక్షర్ శవాన్ని బయటకు తీసి, పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.