పంద్రాగస్టు రోజునే అస్సాంలో వరుస పేలుళ్లు: ఉల్ఫా పనే!
గౌహతి: ఓ వైపు దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే.. అస్సాం రాష్ట్రంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఉత్తర అస్సాంలోని టిన్సుకియా, శివ్సాగర్ జిల్లాల్లో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
ఉల్ఫా తీవ్రవాదులే పేలుళ్లకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కాగా, ఈ పేలుళ్ల ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. తెంగపుకారి ఔట్పోస్ట్ దగ్గర ఉన్న ఖాళీ రోడ్డుపై బాంబు పేలినట్లు పోలీసులు తెలిపారు.
టిన్సుకియా జిల్లాలోని లైపులి శివారు ప్రాంతంలో ఉన్న ఇందిరా గాంధీ స్కూల్ బయట మరో పేలుడు జరిగింది. పేలుడు ఘటనలను పర్యవేక్షిస్తున్నట్లు అస్సాం డిజిపి ముకేష్ సహాయ్ తెలిపారు.
టిన్సుకియా జిల్లాలో నాలుగు పేలుళ్లు చోటు చేసుకున్నాయని ఆయన తెలిపారు. అక్కడే గత శుక్రవారం హిందీ మాట్లాడే ఇద్దరు కూలీలను నిషేధిత ఉల్ఫా తీవ్రవాదులు హతమార్చడం గమనార్హం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమ ఉనికిని చాటుకునేందుకు తీవ్రవాదులు పేలుళ్లకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజలందరూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. తీవ్రవాదుల బెదిరింపులకు వారు భయడపటం లేదని చెప్పారు. భద్రతా దళాలు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు.