కేరళలో ఐదు కొత్త ఒమిక్రాన్ కేసులు; 29కి చేరిన కేసుల సంఖ్య: మంత్రి వీణాజార్జ్ వెల్లడి
భారతదేశాన్ని ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న తీరు థర్డ్ వేవ్ వస్తుందన్న ఆందోళనకు కారణం గా మారింది. ఇక తాజాగా గురువారం నాడు కేరళ రాష్ట్రం మరో ఐదు కొత్త కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు చేసింది. దీంతో ఇప్పటి వరకూ కేరళ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29కి చేరుకుంది. కొత్త రోగులలో నలుగురు ఎర్నాకులంలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వారిని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఐదవ రోగి బెంగళూరు నుండి కోజికోడ్ విమానాశ్రయానికి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం వారందరిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
చరిత్రలోనే అన్ని వైరస్ల కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి; కరోనా దారుణ స్థితికి: బిల్ గేట్స్ ఆందోళన
కేరళలో తాజాగా మరో ఐదు కొత్త ఒమిక్రాన్ కేసులు ... వాళ్ళ ప్రయాణ చరిత్ర ఇది
కేరళ ఆరోగ్య మంత్రి చెప్పిన వివరాల ప్రకారం ఎర్నాకులం (కొచ్చిన్ విమానాశ్రయంలో) చేరుకున్న నలుగురిలో ఇద్దరు యూకే నుండి మరియు ఒకరు అల్బేనియా, మరొకరు నైజీరియా నుండి వచ్చినట్లు తెలిపారు. నివేదికల ప్రకారం, 'రిస్క్లో ఉన్న' దేశాల నుండి కేరళలో అడుగుపెట్టిన 17 మంది, ప్రమాదం లేని దేశాల నుండి 10 మంది ఇప్పటివరకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు పాజిటివ్ పరీక్షించారని జార్జ్ చెప్పారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులతో పరిచయం ఏర్పడిన తర్వాత ఇద్దరు వ్యక్తులు స్ట్రెయిన్ బారిన పడ్డారని ఆమె వెల్లడించారు.
కేరళ కేసులు 29, కర్ణాటక 31, తమిళనాడు 34 కేసులు
కేరళతో పాటు, తమిళనాడు మరియు కర్ణాటకతో సహా అనేక ఇతర రాష్ట్రాలు కూడా గురువారం నాడు కోవిడ్ -19 కొత్తఆందోళనకు కారణమవుతున్న ఒమిక్రాన్ వేరియంట్ యొక్క తాజా ఇన్ఫెక్షన్లను నివేదించాయి. మరో 12 కేసులతో, కర్ణాటకలో ఓమిక్రాన్ సంఖ్య 31కి చేరుకోగా, తమిళనాడులో కొత్త ఒమిక్రాన్ కేసుల నమోదు తో కలిపి మొత్తం సంఖ్య 34కి చేరుకుంది.తాజా గణాంకాలతో, భారతదేశం యొక్క ఒమిక్రాన్ కేసుల సంఖ్య 300 మార్కుకు చేరువలో ఉంది. స్థిరంగా పెరుగుతున్న ఒమిక్రాన్ ట్రెండ్ను కట్టడి చేయడానికి, నియంత్రించడానికి, అనేక రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలపై, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించాయి.
వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల దెబ్బకు విధించిన ఆంక్షలు
ఇదిలా ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని రాత్రిపూట కర్ఫ్యూలు వంటివి అమలు చేయాలంటూ మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. ఇప్పటికే ఢిల్లీలో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలపై నిషేధాజ్ఞలు అమలు చేస్తుండగా, ముంబైలో డిసెంబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని మహారాష్ట్ర సర్కార్ వెల్లడించింది. మరోవైపు గుజరాత్ లో రాష్ట్రంలోని తొమ్మిది ప్రధాన నగరాలలో ఈ నెలాఖరు వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Recommended Video
వ్యాక్సినేషన్ పై ఫోకస్ చేస్తున్న పలు రాష్ట్రాలు
కర్ణాటక రాష్ట్రం బహిరంగ ప్రదేశాలలో సామూహిక వేడుకలను ఇప్పటికే నిషేధించి ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో అప్రమత్తమైంది. మరికొన్ని పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలు వ్యాక్సినేషన్ పై ప్రధానంగా దృష్టి సారించాయి. వ్యాక్సినేషన్ తీసుకోకుంటే జీతాలు ఇవ్వబోమని ప్రభుత్వ ఉద్యోగులకు పంజాబ్ స్పష్టం చేసింది. ఇక హర్యానా జనవరి 1వ తేదీ నుండి పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకోని వారిని బహిరంగ ప్రదేశాలలో అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది . మరోవైపు యూపీలోనూ ఒమిక్రాన్ ఆందోళనల దృష్ట్యా డిసెంబర్ 31వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.