కోవిడ్ రూల్స్ ఉల్లంఘిస్తే ఎయిర్పోర్టుల్లో నో ఎంట్రీ- ప్రయాణికులకు డీజీసీఏ హెచ్చరిక
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికుల తీరుపై డీజీసీఏ సీరియస్ అయింది. మాస్కులు లేకుండా ప్రయాణాలు చేయడం, మాస్కులు సరిగా ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని గుర్తించి విమానాశ్రయాల్లోకి రాకుండా అడ్డుకోవాలని భద్రతా సంస్ధలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
విమానాశ్రయాల్లోకి ప్రవేశించిన తర్వాత, విమానాల్లోకి ఎక్కే సమయంలో మాస్కులు సరిగా పెట్టుకోకపోవడం, అధికారులు చెప్పినా పట్టించుకోని వారిని గుర్తించి వారిని విమానాల్లోంచి దించేయాలని డీజీసీఏ కఠిన హెచ్చరికలు చేసింది. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రయాణికులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని డీజీసీఏ తాజా ఆదేశాల్లో పేర్కొంది. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఉండే ప్రయాణికులను గుర్తించి భద్రతాధికారులకు అప్పగించాలని ఎయిర్లైన్స్ సంస్ధలకు జారీ చేసిన ఆదేశాల్లో డీజీసీఏ తెలిపింది.
ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో డీజీసీఏ వార్నింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. డీజీసీఏ ఇవాళ అన్ని ఎయిర్లైన్ సంస్ధలకు, ఆపరేటర్లకు తాజా మార్గదర్శకాలను పంపింది. వీటిని కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. విఫలమైతే ఎయిర్లైన్ సంస్ధలపైనా చర్యలు తప్పవని డీజీసీఏ హెచ్చరించింది. మరోవైపు ఎయిర్పోర్టులో పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రయాణికులకు జీవితకాలం ఎయిర్పోర్టుల్లో ఎంట్రీ లేకుండా చేయాలని కూడా డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది.