బాహుబలి ప్యాకేజీకి కేంద్రం సిద్దం..? త్వరలో సీతారామన్ ప్రకటన.. ఎంత ప్రకటించనున్నారో తెలుసా..?
కరోనా లాక్ డౌన్ కారణంగా పేద వర్గాలు తీవ్రంగా నష్టపోవడంతో వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1.70లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పారిశ్రామిక వర్గాలకు,రాష్ట్రాలకు ఇంతవరకూ ఎటువంటి ప్యాకేజీని ప్రకటించలేదు. రాష్ట్రాల రుణ పరిమితి పెంపు విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి సరికాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా ముఖంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు ప్రతిపక్షాలు కూడా కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేలా త్వరలోనే కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనుంది.
Recommended Video

3 ట్రిలియన్ల ఉద్దీపన ప్యాకేజీ..
బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం.. రాబోయే వారంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 3 ట్రిలియన్ల(రూ.3లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్నారు. ఆర్థిక మంత్రి మాత్రమే కాకుండా ఇతర కేంద్ర మంత్రులు కూడా సంబంధిత శాఖలకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కీలక ప్రకటన రావచ్చు. ఈ ప్యాకేజీల మొత్తం కేంద్ర బడ్జెట్ నుంచి నేరుగా వస్తుంది. ప్రధానంగా పౌరులు,సంక్షేమ పథకాల లబ్దిదారులు,చిన్న,మధ్య తరహా పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీని రూపొందించారు.

మూడు అంశాల ఆధారంగా..
కేంద్రం ప్రకటించే ఈ భారీ ఉద్దీపన ప్యాకేజీ మొత్తం విలువ ఇతర జీ-20 దేశాల జీడీపీ శాతానికి సమానంగా ఉండవచ్చు. మూడు అంశాలను ఆధారంగా చేసుకుని ఈ భారీ ప్యాకేజీ రూపకల్పనకు ఆలోచన చేసినట్టు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అందులో 1).ఆర్థిక సంవత్సరం-2021కి రుణ పరిమితి రూ.7.8ట్రిలియన్ల నుంచి రూ.12ట్రిలియన్లకు పెంపు.. తద్వారా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టేందుకు సౌలభ్యం ఏర్పడుతుంది. 2) ఆర్థిక తిరోగమన ప్రభావం వ్యవస్థపై ఎంత లోతుగా ఉందో ప్రభుత్వానికి ఉన్న అవగాహన 3) ఎకనమిక్ యాక్టివిటీస్ క్రమంగా పెరుగుతున్నకొద్దీ.. పారిశ్రామిక రంగం,ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలకు అవసరమయ్యే ఆర్థిక మద్దతు,సహకారం. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్యాకేజీ రూపకల్పన ఆలోచన జరిగిందన్నారు.

ఏయే రంగాలకు బెనిఫిట్..
మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ.. అమెరికా తరహానో,యూరోప్ తరహానో తమ ప్యాకేజీ ఉండదన్నారు. మన ట్యాక్స్ జీడీపీ నిష్పత్తి వారి కంటే తక్కువ అని గుర్తుచేశారు. కేంద్రం ప్రకటించబోయే భారీ ప్యాకేజీలో ఆర్థిక,ద్రవ్య పరమైన చర్యలు ఉంటాయన్నారు. పారిశ్రామిక రంగం మెగా ప్యాకేజీలు కావాలని కోరుతోందని.. కేంద్రం దాన్ని విస్మరించలేదని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆర్థికపరమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం(DBT) పొడగింపు,నరేగా చెల్లింపుల పెంపు,కరోనా కారణంగా దెబ్బతిన్న హోటల్స్,టూరిజం,ట్రావెల్,ఏవియేషన్,ఆటో మొబైల్ రంగాలకు బూస్టింగ్ ఇచ్చే చర్యలు కేంద్రం ప్రకటించే ప్యాకేజీలో ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications