కాంగ్రెస్కు మరో షాక్ తప్పదా... రాజీనామా యోచనలో పార్టీ అగ్ర నేత...?
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని... ఇంటి వద్దే ఉండాలనుకుంటున్నానని తన మనసులో మాట బయటపెట్టారు. ఇప్పటికే తాను చాలా సాధించానని... కొత్తగా ఇంకేవో పదవులు పొందాలన్న కోరికలేమీ లేవన్నారు. ఆదివారం(డిసెంబర్ 13) మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో కమల్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కమల్నాథ్ వ్యాఖ్యలను బట్టి త్వరలోనే ఆయన రాజీనామాకు సిద్దపడవచ్చునన్న వాదన వినిపిస్తోంది. విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పడం... రాజకీయాల నుంచి వైదొలిగేందుకేనన్న చర్చ జరుగుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్లో 28 స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత కమల్నాథ్ సారథ్యంపై విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రతిపక్ష హోదాకు కమల్నాథ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత హర్పాల్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేశారని... ఉపఎన్నికల్లో ఓటమికి బాధ్యుడిగా కమల్నాథ్ కూడా రాజీనామా చేయాలని హర్పాల్ సింగ్ అన్నారు.

కాగా,ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్లో కమల్నాథ్ సర్కార్ కూలిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా పార్టీపై తిరుగుబాటు చేసి తనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బీజేపీలోకి తీసుకెళ్లారు. దీంతో సంఖ్యా బలం లేక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ నేత్రుత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఎమ్మెల్యేల రాజీనామాతో రాష్ట్రంలో ఉపఎన్నికలు జరగ్గా... అందులోనూ కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. దీంతో కమల్నాథ్ సారథ్యంపై విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications