union budget 2021- ఈసారి డిజిటల్ జనాభా గణన- దేశ చరిత్రలో తొలిసారిగా
అంతర్జాతీయ మారుతున్నపరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని దేశంలో డిజిటల్ విధానం అమలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మోడీ సర్కార్ ఈసారి కేంద్ర బడ్జెట్ను కూడా ఇదే విధానంలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇదే కోవలో దేశంలో రాబోయే జనాభా గణన కూడా డిజిటల్ విధానంలోనే ఉంటుందని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తున్న డిజిటల్ కార్యక్రమాలను ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఏకరువుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రం అమలు చేస్తున్న వన్ నేషన్-వన్ రేషన్ కార్డు విధానంతో పాటు పలు అంశాలను బడ్డెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. కేంద్రం అమలు చేస్తున్న వన్ నేషన్- వన్ రేషన్ విధానం ద్వారా దేశంలో 86 శాతం అమలవుతోందన్నారు. దీంతో 69 కోట్ల మందికి లబ్ది కలుగుతోందన్నారు. వీటితో పాటు జాతీయ భాషల అనువాద మిషన్ ఏర్పాటును కూడా నిర్మల ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడం, జనాభా గణనకు సమయం దగ్గరపడుతుండటంతో కేంద్రం డిజిటల్ విధానంలోనే జనగణన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారు. ఇది దేశంలోనే తొలి డిజిటల్ జనాభా గణన అవుతుందని నిర్మల తెలిపారు. దీంతో త్వరలో డిజిటల్ జనాభా గణన చేపట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లయింది.












Click it and Unblock the Notifications