parliament session day 6: లోక్ సభలో నలుగురు ఎంపీల సస్పెండ్-రాజ్యసభలోనూ నిరసనలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరో రోజూ విపక్షాల నిరసనలతో ఉభయసభలు దద్దరిల్లాయి. ఉదయం రాష్ట్రపతి ప్రమాణస్వీకారం కోసం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీలు సమావేశం కావడంతో సభలు మధ్యాహ్నం వరకూ వాయిదా పడ్డాయి. అనంతరం సమావేశమైన ఉభయసభల్లోనూ విపక్షాలు ధరల పెరుగుదలతో పాటు ఇతర అంశాలపై చర్చకు పట్టుబట్టాయి. ప్రభుత్వం ఇందుకు అంగీకరించకపోవడంతో వారు ఆందోళనలు కొనసాగించారు.
ఉదయం వాయిదా తర్వాత మధ్యాహ్నం లోక్సభ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడంతో... ప్రతిపక్షాలు ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై నిరసనలు చేపట్టాయి. విపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సభా నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పీకర్ హెచ్చరించినా వారు పట్టు వీడలేదు. ప్రతిపక్ష ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ధరల పెరుగుదలపై చర్చకు డిమాండ్ చేయడంతో, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభా నిబంధనలను ఉల్లంఘించవద్దని ఎంపీలను కోరారు. చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పిన స్పీకర్.. సభలోకి ప్లకార్డు తీసుకొచ్చే సభ్యులెవరినీ సభా కార్యక్రమాల్లో పాల్గొననివ్వబోమన్నారు.అయితే పలువురు ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో లోక్ సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు.
అటు రాజ్యసభలోనూ ధరల పెరుగుదల అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత అభ్యర్థించారు. ఎంపీలు నినాదాలు చేయడంతోపాటు వెల్ లో సమావేశమయ్యారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ ఐదేళ్లు కావస్తున్నా నేటికీ ఈ అంశంపై చర్చ జరగలేదన్నారు. చర్చా హో, చర్చా హో అంటూ నినాదాలు చేస్తూ చర్చ జరగాలని ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటలకు వాయదా పడింది.
రాజ్యసభ సమావేశమైన అనంతరం.. అగ్నివీర్స్పై ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పౌర విమానయాన శాఖ మంత్రి.. పౌర విమానయాన రంగంలోని అన్ని వాటాదారులకు ఉపాధిలో అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ అవగాహన కల్పిస్తోందన్నారు. నాలుగు సంవత్సరాల సైనిక సేవ తర్వాత, అగ్నివీర్స్ ఫిట్గా, క్రమశిక్షణతో, ప్రేరేపిత వృత్తినిపుణులుగా భావిస్తున్నారన్నారు. వారిలో చాలా మందికి, ముఖ్యంగా విమానాల నిర్వహణ, విమాన భద్రత, ఎయిర్ కార్గో, సప్లై చెయిన్, అడ్మినిస్ట్రేటివ్, ఐటి, డ్రోన్లు మొదలైన వాటిలో విలువైన అనుభవాన్ని కలిగి ఉంటారన్నారు .ఇది విమానయాన పరిశ్రమకు ఎంతో ఉపయోగమన్నారు.
లోక్ సభలో కేంద్ర పురావస్తు సలహా మండలి సభ్యుల ఎన్నిక కోసం మంత్రి జి. కిషన్రెడ్డి తీర్మానం చేశారు. "భారత ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, 19 మే, 2022 నాటి రిజల్యూషన్ నెం. T-17019/7/2019-EE యొక్క పేరా 9లోని నిబంధనను అనుసరించి, ఈ సభలోని సభ్యులు ఎన్నుకుంటారు. స్పీకర్ నిర్దేశించిన విధంగా, పేర్కొన్న రిజల్యూషన్లోని ఇతర నిబంధనలకు లోబడి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఆర్కియాలజీలో సభ్యులుగా తమలో నుంచి ఇద్దరు సభ్యులు పనిచేయవలసి ఉంటుంది.
అనంతరం నిరసన తెలుపుతూ సభాకార్యక్రమాల్ని అడ్డుకుంటున్న నలుగురు విపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. లోక్సభలో చైర్లో ఉన్న రాజేంద్ర అగర్వాల్ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న సభ్యులకు హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత నలుగురు ఎంపీలు మాణికం ఠాగూర్, టీఎన్ ప్రతాపన్, రమ్య హరిదాస్, జోతిమణిలను సస్పెండ్ చేశారు. అనంతరం లోక్సభ కార్యక్రమాలు రేపటికి వాయిదా పడ్డాయి.
రాజ్యసభలో మాత్రం సభా కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ప్రతిపక్షాల నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాజ్యసభ సామూహిక విధ్వంస ఆయుధాలు, వాటి పంపిణీ వ్యవస్థల (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) సవరణ బిల్లు, 2022 గురించి చర్చిస్తోంది. ఇందులో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గత యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. "ఉగ్రవాదాన్ని ప్రభుత్వాలు ఎలా రాజకీయం చేశాయో మనం చూశామని, గత యూపీఏ ప్రభుత్వం 'హిందూ టెర్రర్', 'కాషాయ భీభత్సం' వంటి పదాలను కేవలం ఉగ్రవాద చర్యలపై దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి, ఈ దేశంలో భారీ విధ్వంసం సృష్టించిన అనేక సంస్థలకు సురక్షితమైన మార్గం ఇవ్వడానికి మాత్రమే వాడుకుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని "గ్లోబల్ ఎజెండా"లో అనేక ప్రపంచ వేదికలపై ఉంచారని కూడా జీవీఎల్ చెప్పారు. ఇంతలో, చైర్లో ఉన్న సస్మిత్ పాత్ర, పాయింట్ ఆఫ్ ఆర్డర్ కోసం చేసిన అభ్యర్థనలను తిరస్కరించారు, సభ ఆర్డర్ అయ్యే వరకు అభ్యర్థనను అనుమతించలేమని చెప్పారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ను అనుమతించడం కోసం నిరసన తెలుపుతున్న సభ్యులను తమ స్థానాలకు తిరిగి రావాలని ఆయన అభ్యర్థించారు. అయినప్పటికీ నిరసనలు కొనసాగుతున్నాయి.