భారత్ లో ఫోర్త్ వేవ్ భయం: 2వేలనుదాటి కరోనాకేసుల కల్లోలం; ఒకేరోజులో 90శాతం పెరుగుదల
భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నా మొన్నటి వరకు కరోనా కేసులు తగ్గినట్టే భావించినా , ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరగడం ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త కేసులు ఒక రోజు 90 శాతం పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కేసులలో పెరుగుదలతో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ భయం పట్టుకుంది.

తాజా కరోనా కేసులు 2,183, ఒక్కసారిగా 90శాతం పెరుగుదల
ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో మొత్తం 2.6 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,183 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఆదివారంతో పోలిస్తే - రోజువారీ కోవిడ్ కేసులలో భారతదేశం దాదాపు 90 శాతం పెరుగుదలను నమోదు చేసింది. దేశంలో ఒక రోజులో 2,000 కంటే ఎక్కువ కేసులు మార్చి 19న 2,075 నమోదయ్యాయి. తరువాత దాదాపు నెలలో రెండు వేలకు మించి కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇప్పటి వరకు దేశంలో4. 30 కోట్ల మందికి కరోనా మహమ్మారి సోకింది.

మరణాలు 214.. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా
గత 24 గంటల్లో 214 మరణాలు నమోదయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. బ్యాక్లాగ్ డేటాకు అదనంగా మరణాల సంఖ్యను సవరించారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇక నిన్న నమోదైన మరణాలలో అధిక మరణాలు కేరళ నుండే నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.83 శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.32 శాతంగా ఉంది. దేశంలో ఆదివారం 1,150 కరోనావైరస్ కేసులు పెరిగాయి మరియు దేశవ్యాప్తంగా నాలుగు మరణాలు నమోదయ్యాయి.

ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్ .. 500శాతం మేర పెరిగిన కేసులు
దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత నగరంలోని పాఠశాలల్లో మాస్క్ ఆదేశాన్ని తొలగించి, వ్యక్తిగతంగా తరగతులు పూర్తిగా పునఃప్రారంభించబడిన కొద్ది రోజుల తర్వాత ఢిల్లీలో కరోనా కేసుల ఆందోళనకరమైన పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని, ఢిల్లీలో తాజా కరోనా కేసులు 517 నమోదయ్యాయి. అంతకు ముందు రోజు రాజధాని నగరంలో 461 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో, పరిసర ప్రాంతాలలో 15 రోజుల్లో కరోనా వ్యాప్తి 500 శాతం పెరిగినట్లు గా ఓ సర్వేలో వెల్లడైంది. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో అత్యధికంగా 940 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

వివిధ దేశాలలో పెరుగుతున్న కేసులు ... కరోనా ప్రోటోకాల్స్ పాటించాలని సూచన
జనవరిలో మూడవ వేవ్ రోజువారీ సంఖ్యను 3-లక్షల మార్కుపైకి నెట్టివేసిన తరువాత ఇన్ఫెక్షన్లలో క్రమంగా తగ్గుదల నమోదు కావడంతో దేశవ్యాప్తంగా గత కొన్ని వారాలుగా కోవిడ్ నియంత్రణలు సడలించబడ్డాయి.అయినప్పటికీ, అనేక యూరోపియన్ దేశాలు - జర్మనీ, ఫ్రాన్స్ మరియు ఇటలీతో సహా - మరియు చైనా తాజా పెరుగుదలతో పోరాడుతున్నందున కరోనా ప్రోటోకాల్స్ ను తగ్గించవద్దని నిపుణులు హెచ్చరించారు. నిత్యావసరాల కొరతపై ప్రజల ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో చైనా జీరో టాలరెన్స్ కోవిడ్ విధానం అతిపెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది.

భారత్ కు ఫోర్త్ వేవ్ ముప్పు.. అప్రమత్తత అవసరం
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల అత్యంత ప్రసారం చేయగల XE వేరియంట్పై అప్రమత్తం చేసింది, వీటిలో రెండు కేసులు ముంబై మరియు గుజరాత్ లలో నమోదయినట్లు గా ప్రభుత్వ అధికారులు నివేదించారు. తాజాగా పెరుగుతున్న కేసులతో మరోమారు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెరుగుతున్న కేసులను కట్టడి చెయ్యకుంటే ఫోర్త్ వేవ్ పొంచి ఉందన్న ప్రమాదం అందరూ గుర్తించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications