కరోనా విరుగుడుకి కేంద్రం ఆ ప్రతిపాదన.. కుదరదన్న ఐసీఎంఆర్.. ఎందుకంటే..?
కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది సైంటిస్టులు ల్యాబోరేటరీల్లో అవిరామంగా శ్రమిస్తున్నారు. భారత్లోనూ అనేక బయోటెక్ కంపెనీలు వ్యాక్సిన్ తయారీ ప్రయోగాల్లో తలమునకలయ్యాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐసీఎంఆర్కు పలు విజ్ఞప్తులు వస్తున్నాయి. గంగాజలంతో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టవచ్చేమో పరీక్షించాలని జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఐసీఎంఆర్కు విజ్ఞప్తి చేసింది. అయితే ఐసీఎంఆర్ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.

కుదరదని చెప్పిన ఐసీఎంఆర్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)లో పరిశోధన ప్రతిపాదనల మూల్యాంకన కమిటీ చైర్ పర్సన్ డా.వైకె గుప్తా దీనిపై మాట్లాడారు. గంగాజలంతో వ్యాక్సిన్ ప్రయోగాలు జరపాలంటే తగినంత సైంటిఫిక్ డేటా అవసరమని.. ఇప్పటికైతే అలాంటి డేటా ఏదీ అందుబాటులో లేదని తెలిపారు. గంగా నది ప్రక్షాళ కోసం జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(NMCG)కి కూడా అనేకే ప్రతిపాదనలు వచ్చాయి. పలువురు వ్యక్తులు,ఎన్జీవోలు గంగా జలంపై క్లినికల్ పరిశోధనలు జరపాలని విజ్ఞప్తి చేశారు.

సాధ్యపడదన్న గుప్తా..
ఏప్రిల్ 28వ తేదీన ఈ ప్రతిపాదనలను ఐసీఎంఆర్కి పంపించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గంగా జలంపై క్లినికల్ పరిశోధన సాధ్యపడదని గుప్తా ఎన్ఎంసీజీకి స్పష్టం చేశారు. ఆ ప్రతిపాదనలకు సైంటిఫిక్ డేటా,ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్,తగు ఆధారాలు అవసరమని చెప్పారు. ఎన్ఎంసీజీ అధికారులు మాట్లాడుతూ.. తమ ప్రతిపాదనలను నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(NEERI) అధికారులతో చర్చించినట్టు తెలిపారు. గంగానది నీళ్ల ప్రత్యేక లక్షణాలు,నాణ్యత ఈ సంస్థ గతంలో పరిశోధనలు జరిపింది.

ఆగని ప్రతిపాదనలు..
NEERI అధ్యయనం ప్రకారం, గంగా నీటిలో బ్యాక్టీరియోఫేజ్లు అధికంగా ఉన్నాయి. వీటిని నింజా వైరస్ అని కూడా పిలుస్తారు. NMCG, NEERIల మధ్య జరిగిన సంప్రదింపుల సందర్భంగా గంగా నది నీళ్లలో ఎటువంటి యాంటీ-వైరల్ లక్షణాలు ఉన్నట్టు రుజువు కాలేదని సైంటిస్టులు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఐసీఎంఆర్కు గంగా నీళ్లపై పరిశోధనలు జరపాలని ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. అలాగే తెహ్రీ-భగీరథి,శ్రీనగర్-అలకనంద నదుల్లోని పైభాగంలో ఉన్న నీటితోనూ పరిశోధనలు జరపాల్సిందిగా ప్రతిపాదనలు వచ్చాయి.












Click it and Unblock the Notifications