పెళ్లి కాలేదు: గీత ఎవరినీ గుర్తించలేదు, సుష్మ థ్యాంక్స్
ఢిల్లీ: పాకిస్తాన్ నుంచి వచ్చిన గీత విషయంలో కొత్త ట్విస్ట్. మహతో ఫ్యామిలీ తన కుటుంబం కాదని గీత చెప్పింది. మహతో ఫ్యామిలీ చూపిస్తున్న ఫోటోలు తనవి కాదని గీత తెలిపింది. తాను చిన్నప్పుడే తప్పిపోయానని, తనకు ఇంకా పెళ్లి కాలేదని గీత తెలిపింది.
దీనిపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ... గీతను ఇండోర్లోని సంస్థలో చేర్పిస్తామని చెప్పారు. నాలుగు కుటుంబాలు గీత తమ బిడ్డనేనని ముందుకు వచ్చాయని చెప్పారు. వారిలో ఎవరినీ కూడా గీత తన తల్లిదండ్రులుగా గుర్తించడం లేదని చెప్పారు.
గీతను ఇన్నాళ్ల పాటు సంరక్షించిన ఈదీ ఫౌండేషన్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గీత ఎవరినీ తన కుటుంబ సభ్యులుగా గుర్తించడం లేదని, నాలుగు కుటుంబాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
కాగా, 15 ఏళ్ల క్రితం తప్పిపోయి పాక్కు చేరిన భారత్కు చెందిన గీత కరాచీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. 10.40 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న గీతతో పాటు పాకిస్థాన్కు చెందిన ప్రతినిధులు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ను కలిశారు.