బెంగాల్లో ఘర్ వాపసీ మొదలు- నేడు టీఎంసీలోకి ముకుల్రాయ్- బీజేపీకి షాకులు
బెంగాల్ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నేపథ్యంలో గతంలో బీజేపీలోకి వెళ్లిన నేతలంతా తిరిగి టీఎంసీవైపు చూస్తున్నారు. బీజేపీ వాపును బలుపుగా భావించి వరుసగా ఎన్నికలకు ముందు కాషాయ పార్టీలోకి దూకిన నేతలంతా తిరిగి తృణమూల్ గూటికి చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీఎం మమతా బెనర్జీ మాత్రం వలస నేతల విషయంలో సెలక్టివ్గా ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఎన్నికలకు ముందు టీఎంసీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరి జాతీయ ఉపాధ్యక్ష పదవి అందుకున్న సీనియర్ నేత ముకుల్ రాయ్. ఆయన కుమారుడు సుభ్రాంగ్షు రాయ్తో కలిసి తృణమూల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం మమతా బెనర్జీతో భేటీ తర్వాత ముకుల్రాయ్,సుభ్రాంగ్షు తృణమూల్ గూటికి చేరిపోవడం ఖాయమైపోయింది. గతంలో పార్టీలో సీనియర్ నేతగాఉంటూ ఎన్నో పదవులు అనుభవించిన ముకుల్ రాయ్పై కేంద్రం పలు కుంభకోణాల్లో కేసులు కూడా నమోదు చేసింది. బీజేపీలోకి చేరిన తర్వాత దర్యాప్తు సంస్ధలు వాటిని పట్టించుకోలేదు. కానీ జనం తిరస్కరించడంతో తిరిగి సొంతగూటికి ఆయన వచ్చేస్తున్నారు.
వాస్తవానికి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ.. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన తమ నేతలతో చర్చలు జరుపుతున్నామని, తుది నిర్ణయం దీదీ తీసుకుంటారని తాజాగా వెల్లడించారు. దీంతో టీఎంసీలోకి నేతల ఘర్వాపసీ తథ్యమన్న ప్రచారం మొదలైంది. ఇప్పుడు ముకుల్ రాయ్ ఇవాళ చేరితో టీఎంసీకి తిరిగొచ్చిన తొలి నేత ఆయనే అవుతారు. ఆయన బాటలోనే మరికొందరు నేతలు త్వరలోనే టీఎంసీ గూటికి చేరుకోనున్నారు. ఈ మేరకు తెరవెనుక చర్చలు జరుగుతున్నాయి. టీఎంసీని వీడి గతంలో బీజేపీలో చేరిన నేతలు చాలా మంది ఇప్పుడు దీదీ ప్రాపకం కోసం తహతహలాడుతున్నారు.