బలవంతపు పెళ్లి: భర్త, ఫ్యామిలీ నుంచి ఆ యువతికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన సుప్రీంకోర్టు
బెంగళూరు/న్యూఢిల్లీ: తన ఇష్టం లేకుండానే తనకు తన తల్లిదండ్రులు బలవంతంగా వివాహం చేశారని సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక యువతికి సర్వోన్నత న్యాయస్థానం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. తనకు నచ్చిన చోటుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది.
కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమార్తె తనకు బలవంతంగా పెళ్లి చేశారని కోర్టును గత కొద్ది రోజుల క్రితం ఆశ్రయించారు. ఈ బలవంతపు వివాహం కారణంగా తన చదువు, తన ఆశయాలు కలగానే మిగిలిపోయాయని ఆమె కోర్టుకు తెలిపారు.
ఆ యువతికి పూర్తి స్వేచ్ఛ
కాగా, కేసు విచారణ జరిపిన కోర్టు ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆమెను నచ్చిన చోటుకు వెళ్లొచ్చని, చదువు, కెరీర్ కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేగాక, ఆమెకు రక్షణ కల్పించాల్సిందిగా కర్ణాటక రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.
ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు
‘నువ్వు మేజర్వి. నీకు నచ్చిన చోటుకు వెళ్లేందుకు నీకు స్వేచ్ఛ ఉంది' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం తెలిపింది. తల్లిదండ్రులు సహా కుటుంబసభ్యులు, భర్త ఎవ్వరూ కూడా ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది.
బలవంతపు పెళ్లి
మార్చి 14న 26ఏళ్ల సదరు యువతికి ఆమె తల్లిదండ్రులు ఆమె ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరో వ్యక్తితో వివాహం జరిపించారు. ఆ తర్వాత గుల్బార్గాలోని తన ఇంటి నుంచి పారిపోయిన ఆమె.. ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఇష్టంతో ప్రమేయం లేకుండా తన తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని ఆరోపించారు. తన వివాహాన్ని రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ బాధిత యువతి తరఫున వాదించారు.
ఇబ్బంది పెట్టబోమని తల్లిదండ్రులు
సదరు యువతి డాక్యుమెంట్లు, చదువు సంబంధించిన సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అన్నీ ఆమె తల్లిదండ్రుల వద్దే ఉన్నాయని తెలిపారు. కాగా, తమ కూతురుని ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని, డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చేస్తామని కోర్టు ఆదేశాల అనంతరం ఆమె తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. యువతి ఇక విడాకుల ప్రక్రియ ప్రారంభిస్తారని లాయర్ జైసింగ్ కోర్టుకు వివరించారు.