corona virus: google ఉద్యోగికి పాజిటివ్, మిగతా సిబ్బందికి పరీక్షలు, నేటినుంచి వర్క్ ఫ్రం హోం
కరోనా వైరస్ రక్కసి చాపకిందనీరులా వ్యాపిస్తోంది. దేశంలో ఇప్పటికే 74 మందికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భయాందోళన నెలకొన్న క్రమంలో ఐటీ హబ్ బెంగళూరులో గూగుల్లో పనిచేస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ఈ మేరకు కంపెనీ కూడా ధృవీకరించింది. తమ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని.. అతనితో సన్నిహితంగా ఉన్నవారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నది.
కొద్ది గంటల ముందు ఉద్యోగికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అతనితో సన్నిహితంగా ఉన్నవారికి కూడా పరీక్షలు చేసి, అవసరమైతే నిర్భందంలో ఉంచుతామని వెల్లడించింది. ఆఫీసులో పనిచేసే వ్యక్తికి వైరస్ సోకినందున.. కార్యాలయం క్లీన్ చేయాల్సి ఉంది. శుక్రవారం నుంచి ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. తమకు ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని కంపెనీ తెలిపింది.
Recommended Video
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 74కి చేరాయి. ఇందులో నాలుగు కర్ణాటకలోనే నమోదు కావడం విశేషం. 74 మందిలో 16 మంది ఇటలీ పర్యాటకులు కాగా.. ఒకరు కెనడాకు చెందిన వారు ఉన్నారు. యూపీలో 10 కేసులు, మహారాష్ట్రలో 11, లడాఖ్ మూడు, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్లలో ఒక్కో కేసు నమోదైంది. కేరళలో అత్యధికంగా 17 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు వైరస్ తగ్గి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో తొలి కరోనా మృతి కూడా నమోదైంది. కర్ణాటకకు కలబుర్గిలో 76ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ సిద్దిఖీ మృతిచెందారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన అతనికి వైరస్ సోకింది. హైదరాబాద్ ఆస్రత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే.