ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సైనికులకు మెడల్స్..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలకమైన ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఫూటేజ్, ఫొటోలను గతంలోనే విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. భారత సైన్యం జరిపిన దాడుల్లో వందల మంది ఉగ్రవాదులు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ వెల్లడించింది. అలాగే ఆపరేషన్ సింధూర్ కు ప్రతిగా భారత్ పై వందల కొద్దీ డ్రోన్ లు, క్షిపణులతో పాకిస్థాన్ రెచ్చిపోయింది. కానీ భారత సైన్యం వాటిని సమర్థవంతంగా ధ్వంసం చేసింది.
ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యం తెగువ, పరాక్రమం, ధైర్యసాహసాలు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్ హీరోలను సత్కరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15.. 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను గుర్తించి మెడల్స్ అందించనుంది. భారత వైమానిక దళానికి చెందిన 13 మంది అధికారులకు యుద్ధ సేవా పతకం, 9 మంది అధికారులకు వీర్ చక్ర అవార్డులు దక్కాయి. వీటిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు.
వీర్ చక్ర పురస్కారం పొందిన వారి వివరాలు..
1. రంజిత్ సింగ్ సిద్ధూ
2. మనీష్ అరోరా
3. అనిమేష్ పట్ని
4. కునాల్ కల్రా
5. జాయ్ చంద్ర
6. సార్థక్ కుమార్
7. సిద్ధాంత్ సింగ్
8. రిజ్వాన్ మాలిక్
9. అర్ష్వీర్ సింగ్ ఠాకూర్

అలాగే మరో నలుగురు భారత వైమానిక దళ అధికారులకు సర్వోత్తమ యుద్ధ సేవా పతకం లభించింది. ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నరేంద్రేశ్వర్ తివారీ, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ కమాండర్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా, ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ అవధేశ్ భారతి ఉన్నారు. వీరితోపాటు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీసు, భద్రతా సిబ్బందికి కేంద్రం పురస్కారాలను ప్రకటించింది. 99 మందికి రాష్ట్రపతి పతకాలు, 233 మందికి గ్యాలెంటరీ అవార్డు, 758 మందికి మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి.












Click it and Unblock the Notifications