సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో ‘ఇండియన్ డబుల్ మ్యూటెంట్’!
న్యూఢిల్లీ: కొద్ది వారాల క్రితం కేంద్రం సుప్రీంకోర్టులో సమర్పించిన ఓ అఫిడవిట్లో ఇండియన్ డబుల్ మ్యూటెంట్ అని పేర్కొందని, ఇప్పుడేమో ఇండియన్ వేరియంట్ అని అనకూడదని అంటోందని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) కోవాగ్జిన్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వివరిస్తూ దాఖలు చేసిన అఫిడవిట్లో ఇండియన్ డబుల్ మ్యూటెంట్ అని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత మూడు రోజులకు బీ.1.617 వేరియంట్ను ఇండియన్ వేరియంట్ అని సంబోధించకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇండియన్ వేరియంట్ అంటూ వచ్చిన మీడియా కథనాలను కేంద్రం ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా బీ.1.617ను ఇండియన్ వేరియంట్ అని పేర్కొనలేదని, గ్లోబల్ కన్సర్న్ అని సంబోధించిందని స్పష్టం చేసింది. వేరియంట్ ఎక్కడ గుర్తించినా.. ఆ దేశం వేరియంట్ అని పేర్కొనడం లేదని డబ్ల్యూహెచ్ఓ తేల్చి చెప్పింది. శాస్త్రవేత్తలు సూచించిన సైంటిఫిక్ పేర్లను మాత్రమే వాటికి ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
మే 9న ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నది కూడా ఇందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. అంతేగాక, ఇప్పటికే యూకే వేరియంట్ అని, బ్రెజిల్ వేరియంట్ అని, సౌత్ ఆఫ్రికా వేరియంట్ అని ఆ అఫిడవిట్లో పేర్కొన్నట్లు సమాచారం. అన్ని శాఖలను సంప్రదించిన తర్వాతే ఈ అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేష్ మే 9న కేంద్రం సమర్పించిన అఫిడవిట్ను ప్రస్తావిస్తున్నారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వం డబుల్ మ్యూటెంట్ అని ఎందుకు పేర్కొందని ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత మే 12న ఆ ఇండియన్ వేరియంట్ అంటూ సంబోధించకూడదని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఎందుకు కోరుతోందని నిలదీశారు. కాగా ఇండియన్ వేరియంట్ అని ఎక్కడా పేర్కొనకూడదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
Recommended Video