ప్రభుత్వం భయపడింది.. తప్పు చేసింది, అందుకే చర్చించలే: రాహుల్ గాంధీ
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించంగా.. ఇవాళ ఉభయ సభ బిల్లు ఆమోదం పొందింది. అయితే చట్టాల రద్దుకు సంబంధించి బిల్లుపై చర్చ లేకుండానే ఆమోదం తెలిపింది. దీనిపై ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. చర్చ లేకుండా బిల్లు ఆమోదించడం ఏంటీ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అంటే చర్చించడానికి ప్రభుత్వం భయపడుతుంది అని ఆయన కామెంట్ చేశారు.
లోక్ సభ, రాజ్యసభలో విపక్ష సభ్యుల నినాదాల మధ్య రెండు బిల్లులకు సభలు ఆమోదం తెలిపాయి. చర్చ జరపాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. రైతుల కన్నా దేశంలో ముగ్గురు, నలుగురు వ్యాపారులు అత్యంత శక్తిమంతులు అని రాహుల్ ఆరోపించారు. అందుకోసమే ఇవాళ ఇలా జరిగి ఉంటుందని కామెంట్ చేశారు. కానీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే అంశం మాత్రం.. అన్నదాతల విజయమేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.
ఏదో తప్పు చేసినందునే ప్రభుత్వం భయపడుతోందని రాహుల్ గాంధీ అన్నారు. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశంలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. నిరసనల సమయంలో 750 మంది రైతులు ప్రాణ త్యాగం చేశారు. అందుకు బాధ్యులు ఎవరనీ.. ఇచ్చే పరిహారంతో ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందా అని అడిగారు. బిల్లు ప్రవేశపెట్టి.. చట్టం చేసే సమయంలో తప్పు అని తెలియదా అని అడిగారు.
పంటకు కనీస మద్దతు ధర కోసం రైతులు అడుగుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం తప్పకుండా ఇవ్వాల్సిందేనని రాహుల్ స్పష్టంచేశారు. యూపీ ఇతర రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికలు కూడా వస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.