జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు, సామాన్యులు, వ్యాపారులు, ఎగుమతిదారులకు ఊరట
జీఎస్టీ కౌన్సిల్ తన 22వ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా నిర్ణయాల వల్ల సామాన్యులు, వ్యాపారులు, ఎగుమతిదారులకు ఊరట కలగనుంది. కౌన్సిల్ తాజా నిర్ణయాలను కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు.
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ తన 22వ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా నిర్ణయాల వల్ల సామాన్యులు, వ్యాపారులు, ఎగుమతిదారులకు ఊరట కలగనుంది.
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు.
గత మూడు నెలలు పరివర్తన దశ అని, అందువల్ల వసూళ్ళ గురించి స్పష్టమైన వివరాలు తెలియవని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్మాల్ స్కేల్ సెక్టర్, ఎగుమతులపై ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలిపారు. మొత్తం 27 నిత్యావసర వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు అరుణ్ జైట్లీ చెప్పారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎగుమతిదారులకు ఈ-వ్యాలెట్ల విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఎగుమతులపై 0.1శాతం నామమాత్రపు జీఎస్టీ విధిస్తామని ప్రకటించారు. రిఫండ్స్ను ఈ నెల 10 నుంచి చెక్కుల రూపంలో ఇస్తామన్నారు.
చిన్న వ్యాపారులకు జీఎస్టీ నుంచి ఊరట లభించింది. కంపోజిషన్ స్కీమ్ను రూ.75 లక్షల నుంచి రూ.కోటికి పెంచాలని నిర్ణయించినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. ఏసీ రెస్టారెంట్లకు ప్రస్తుతం అమలులో ఉన్న జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.
ఈ స్కీమ్లో భాగంగా 1-5 శాతం పన్నును వ్యాపారులు చెల్లించవలసి ఉంటుందని, మూడు నెలలకోసారి రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. కిరాణా దుకాణాల్లో గోధుమ పిండి వంటివాటికి బ్రాండెడ్ ప్యాకెట్లపై మాత్రమే పన్ను ఉంటుందని, సాధారణంగా అమ్మేవాటిపై పన్ను ఉండదని తెలిపారు.
టర్నోవరు రూ.1.5 కోట్లు ఉన్న చిన్న వ్యాపారులు మూడు నెలలకోసారి రిటర్నులను దాఖలు చేయాలన్నారు. రూ.1 కోటి కన్నా తక్కువ టర్నోవరు ఉన్న ఏసీ రెస్టారెంట్లపై పన్ను విధానాన్ని సమీక్షించామన్నారు. మంత్రుల బృందం దీనిపై అధ్యయనం చేస్తుందని, రెండు వారాల్లోగా నివేదికను సమర్పిస్తుందన్నారు.
ఏప్రిల్ 1 నుంచి ఈ- వే బిల్లులను ప్రవేశపెడతామన్నారు. రూ. 20 లక్షల కన్నా తక్కువ టర్నోవరుగల సర్వీస్ ప్రొవైడర్లకు పన్ను మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. అలాగే ఐసీడీఎస్ బాలలకు సరఫరా చేసే ఆహారంపై పన్నును 5 శాతానికి తగ్గించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.
అన్ బ్రాండెడ్ నమ్ కీన్, ఆయుర్వేదిక్ మందులపై ఉన్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. మామిడి తాండ్ర, ఖాక్రాపై కూడా ఇదేవిధంగా పన్నును 5 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.
నగల కొనుగోలుదారులకు శుభవార్త...
మరోవైపు ఆభరణాల కొనుగోలుదారులకు వూరటనిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.50 వేలకు పైగా విలువ చేసే నగల కొనుగోలుకు పాన్, ఆధార్ నిబంధనను ఎత్తివేసింది. దీంతో పాటు రూ.2 కోట్లు టర్నోవర్ గల నగల వ్యాపారులను మనీలాండరింగ్ పరిధిలోకి రాకుండా నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రభుత్వ ఉత్తర్వులపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన దృష్ట్యా జీఎస్టీ కౌన్సిల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications