gujarat polls : గుజరాత్ రెండోదశ ప్రచారానికి తెర-ఎల్లుండి పోలింగ్-బరిలో సీఎం, హార్ధిక్..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ రంగం సిద్ధమవుతోంది. ఎల్లుండి రాష్ట్రంలోని 93 నియోజకవర్గాల్లో రెండోదశ పోలింగ్ జరగబోతోంది. ఈ 93 సీట్లలో ఇవాళ్టితో ప్రచారం ముగిసింది. ఇప్పటికే తొలిదశలో 89 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఇందులో హోరాహోరీ పోరు నెలకొన్నట్లు సంకేతాలు రావడంతో రెండోదశ సీట్లపైనా అన్ని సీట్లు గురిపెట్టాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 182 సీట్లకు డిసెంబర్ 1న తొలిదశ, డిసెంబర్ 5న రెండోదశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులోతొలిదశ పోలింగ్ లో భాగంగా డిసెంబర్ 1 జరిగిన ఎన్నికల్లో 63.31 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఎల్లుండి జరిగే రెండోదశ ఎన్నికల్లో 833 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అలాగే బీజేపీ, కాంగ్రెస్, ఆప్ తో పాటు 60 రాజకీయ పార్టీలు రెండో దశ పోలింగ్ లో పోటీ పడుతున్నాయి.
రెండోదశ పోలింగ్ లో భాగంగా ఉత్తర, మధ్య గుజరాత్ లోని 14 జిల్లాలో ఈ 93 సీట్లు ఉన్నాయి. ఇందులో అహ్మదాబాద్, వడోదర, గాంధీ నగర్ జిల్లాల్లోని నియోజకవర్గాలున్నాయి. అలాగే సీఎం భూపేంద్ర పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘట్లోడియా సీటుతో పాటు బీజేపీ నేత హార్దిక్ పటేల్ పోటీ చేస్తున్న విరంగం నియోజకవర్గం కూడా ఉన్నాయి. అలాగే మరో బీజేపీ నేత అల్పేష్ ఠాకూర్ పోటీ చేస్తున్న గాంధీనగర్ సౌత్ సీటు కూడా ఉంది. ప్రధాని మోడీ రెండురోజులుగా ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం పూర్తి చేశారు. ఇవాళ కూడా యోగీ, స్మృతీ ఇరానీతో పాటు పలువురు బీజేపీస్టార్ క్యాంపెయినర్లు ఈ నియోజకవర్గాల్ని చుట్టి వచ్చారు.