ప్రధాని మోడీతో జమ్ముకశ్మీర్ అఖిలపక్షం భేటీ- కీలక డిమాండ్లు ఇవే
జమ్ముకశ్మీర్ భవిష్యత్తుపై చర్చించేందుకు అక్కడి అఖిలపక్ష నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో వారు భేటీ అయ్యారు. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా రద్దు చేసిన తర్వాత గుప్కర్ అలయన్స్గా ఏర్పడిన అఖిలపక్ష నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రధానితో భేటీ అయిన వారిలో ఉన్నారు.
ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో గుప్కర్ అలయన్స్ నేతలు రెండు కీలక డిమాండ్లను ఆయన ముందు ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదలను ప్రధాని ముందు ఉంచాలని నేతలు ఇప్పటికే నిర్ణయించారు. ముఖ్యంగా ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు తర్వాత తమ రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులను ప్రధాని దృష్టికి నేతలు తీసుకెళ్లబోతున్నారు. ప్రధాని మోడీతో భేటీకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన కీలక నేత ఫరూక్ అబ్దుల్లా సమావేశం అజెండాపై తమకు స్ఫష్టత లేదన్నారు. ప్రధానితో భేటీ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.
అయితే ప్రధాని మోడీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా జమ్ముకశ్మీర్లో చేపట్టాల్సిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై వీరితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరిస్తే జమ్ముకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని గుప్కర్ అలయన్స్ నేతలకు ప్రధాని హామీ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జమ్ము కశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తున్న గుప్కర్ అలయన్స్ నేతలకు ప్రధాని ఈ భేటీలో ఇచ్చే హామీలను బట్టి రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నేతలు చెప్తున్నారు.