Gyanvapiలో హిందువుల పూజలపై తేల్చేసిన వారణాశి కోర్ట్: ప్రతి ఇంట్లోనూ దీపం వెలిగించాలి..!!
లక్నో: చారిత్రాత్మకమైన వారణాశిలో గల జ్ఞాన్వాపి మసీదులో హిందువులు పూజలను నిర్వహించడంపై వారణాశి జిల్లా న్యాయస్థానం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. మసీదులో హిందువులు పూజలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ను విచారణకు స్వీకరించడానికి న్యాయస్థానం అంగీకరించలేదు. ఈ పిటీషన్ను తోసిపుచ్చింది. అంజుమన్ కమిటీ దాఖలు చేసిన పిటీషన్ ఇది.
శివాలయం శిథిలాలపై..
జ్ఞాన్వాపి మసీదులో శివాలయం ఉండేదని, దాన్ని నేలమట్టం చేశారనేది హిందూ ధార్మిక సంఘాల వాదన. దీనికి సంబంధించిన పలు సాక్ష్యాధారాలను వారు న్యాయస్థానానికి సమర్పించారు. ఈ మసీదులో ప్రాచీన శివలింగం, నంది, కోనేరు కూడా ఉన్నాయని వారు న్యాయస్థానానికి వివరించారు. అక్కడ పూజలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ మేరకు వారు దాఖలు చేసిన పిటీషన్ను వారణాశి జిల్లా న్యాయస్థానం సింగిల్ బెంచ్ జడ్జ్ జస్టిస్ అజయ్ కృష్ణ విశ్వేశ్వ్ విచారణ చేపట్టారు.
అంజుమన్ కమిటీ పిటీషన్పై..
దీనికి కౌంటర్గా అంజుమన్ ఇంతెజామియా మసీద్ మేనేజ్మెంట్ కమిటీ పిటీషన్ దాఖలు చేసింది. హిందూ ధార్మిక సంఘాల తరఫున విష్ణు శంకర్ జైన్, అంజుమన్ కమిటీ తరఫున సీనియర్ అడ్వొకేట్ మిరాకుద్దీన్ సిద్ధిఖీ తమ వాదనలను వినిపించారు. అంజుమన్ కమిటీ పిటీషన్పై విచారణ చేపట్టడానికి న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కృష్ణ విశ్వేశ్వ్ నిరాకరించారు. దీన్ని మెయింటెనబుల్గా లేదని అన్నారు. హిందూ ధార్మిక సంఘాల పిటీషన్ మెయింటెయిన్ చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు.
హర్షాతిరేకాలు..
ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే హిందూ ధర్మాక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జ్ఞాన్వాపి మసీదు వద్ద పూజలు చేయడానికి సిద్ధం అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రతి హిందువు కూడా ఇవ్వాళ దీపాలను వెలిగించాలని పిటీషనర్ మంజు వ్యాస్ విజ్ఞప్తి చేశారు. ఇవ్వాళ దేశంలో ఉన్న ప్రతి హిందువు ఈ ఆదేశాలను స్వాగతిస్తున్నారని అన్నారు. ఇది హిందువుల సమష్టి విజయమని మరో పిటీషనర్ సోహన్ లాల్ ఆర్య అన్నారు.
హైకోర్టులో ఛాలెంజ్..
వారణాశి జిల్లా సింగిల్ బెచ్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తోన్నామని అంజుమన్ కమిటీ తరఫు న్యాయవాది మిరాకుద్దీన్ సిద్ధిఖి అన్నారు. దీనిపై తాము ఉత్తర ప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. కొన్ని ఒత్తిళ్లు పని చేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనికి అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే తీసుకుంటామని అన్నారు. ఈ నెల 22వ తేదీన తమ వాదనలను మరోసారి సింగిల్ బెంచ్ జడ్జ్ ముందు వివరిస్తామని పేర్కొన్నారు.