బిహార్ అసెంబ్లీలో రచ్చ.. విపక్ష ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి? ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారన్న ఆర్జేడీ...
బిహార్ అసెంబ్లీలో మంగళవారం(మార్చి 23) తీవ్ర రభస చోటు చేసుకుంది. పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం 'స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ బిల్ 2021'పై సభలో ప్రతిపక్షం ఆర్జేడీ సహా ఇతర విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో పలువురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎమ్మెల్యేలు అక్కడినుంచి కదల్లేదు. దీంతో సభ ఐదుసార్లు వాయిదా పడింది. సాయంత్రం సభ తిరిగి ప్రారంభమయ్యే ముందు విపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్ను చుట్టుముట్టడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

స్పీకర్ ఛాంబర్ను చుట్టుముట్టడంతో...
సాయంత్రం సమయంలో విపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్ వద్దకు నిరసన తెలిపారు. ఆయన్ను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ఆదేశాలతో పోలీసులు,మార్షల్స్ రంగప్రవేశం చేసి వారిని అసెంబ్లీ నుంచి బయటకు లాక్కెళ్లారు. అయితే ఈ క్రమంలో విపక్ష ఎమ్మెల్యేలపై దాడి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు తమ ఎమ్మెల్యేలను కొట్టారని ఆర్జేడీ ఆరోపిస్తోంది. దీనికి ఊతమిచ్చేలా పలు వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఒక వీడియోలో అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యే ఒకరు సొమ్మసిల్లి పడిపోవడం... మహిళా పోలీసులు ఆమెను బయటకు లాక్కెళ్తుండటం కనిపిస్తోంది.
ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు : ఆర్జేడీ
మరో వీడియోలో... కిందపడిపోయిన ఆర్జేడీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ను స్ట్రెచర్లో తరలిస్తుండటం గమనించవచ్చు. తమపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎస్పీ తన ఛాతిపై బలంగా కొట్టాడని... ఎమ్మెల్యేలపై దాడి చేయడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ఎమ్మెల్యే సత్యేంద్ర కుమార్ ఆరోపించారు. 'స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ బిల్ 2021' చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ నేత్రుత్వంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వగా... పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. తేజస్వి యాదవ్తో పాటు ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్జేడీ చేపట్టిన నిరసన ర్యాలీలో కొన్ని అసాంఘీక శక్తులు చొరబడి హింసకు పాల్పడ్డారని ఆ పార్టీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
ఆ చట్టం అమలులోకి వస్తే...
'స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ బిల్ 2021' చట్టాన్ని బిహార్ విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. దీనిపై తేజస్వి యాదవ్ మాట్లాడుతూ... ఈ చట్టం గనుక అమలులోకి వస్తే వారెంట్ లేకుండానే సోదాలు చేసే అధికారం పోలీసులకు వస్తుందన్నారు. అదే జరిగితే... ఎవరిపై ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే అరెస్ట్ చేస్తారని అన్నారు. అలాంటప్పుడు కోర్టులు,మెజిస్ట్రేట్లతో ఇక పని ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తేజస్వి డిమాండ్ చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications