హ్యాట్సాఫ్ స్వామి: రూ.35కోసం రైల్వేతో ఐదేళ్ల పోరాటం; అతని విజయంతో 2.98లక్షల మందికి లబ్ది!!
కేవలం ముప్పై ఐదు రూపాయల కోసం ఓ వ్యక్తి చేసిన పోరాటం 2.98 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. 35 రూపాయలే కదా, ఏముంది లే అని వదిలిపెట్టకుండా అయిదేళ్లపాటు పోరాడిన ఓ వ్యక్తి చివరకు విజయం సాధించారు. తనకు రావలసిన 35 రూపాయలను తిరిగి సాధించుకున్నారు. తన 35 రూపాయలతో పాటు 2.98 లక్షల మందికి 2.43 కోట్ల రూపాయలను తిరిగి ఇప్పించిన వాడయ్యాడు. ఈ పోరాటం వివరాల్లోకి వెళితే
రైల్వేపై పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాటం చేసిన ఇంజనీర్
రాజస్థాన్ లోని కోట కు చెందిన సుజిత్ స్వామి పట్టువదలని విక్రమార్కుడిలా రైల్వే పై పోరాటం చేసి విజయం సాధించారు. సుజిత్ స్వామి అనే ఇంజనీర్ జూలై 2 2017 వ తేదీన కోట నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఐ ఆర్ సి టి సి ద్వారా ఏప్రిల్ లో టికెట్ బుక్ చేసుకున్నారు. టికెట్ ధర 765 రూపాయలు చెల్లించారు. ఆ తర్వాత ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో వంద రూపాయలు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ఐఆర్సిటిసి రిఫండ్ చేసింది.
జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన 35రూపాయల కోసం పోరాటం
అయితే క్యాన్సిలేషన్ రుసుము 65 రూపాయలు మాత్రమే తీసుకోవాల్సి ఉండగా అదనంగా 35 రూపాయలు జీఎస్టీ కింద వసూలు చేయడంతో స్వామి రైల్వే పై పోరాటానికి దిగారు. తాను జీఎస్టీ అమల్లోకి రాకముందే టికెట్ బుక్ చేసుకున్నానని, అలాంటప్పుడు తన నుంచి జిఎస్టి ఎలా వసూలు చేస్తారంటూ రైల్వే పై పోరాటం మొదలు పెట్టాడు. రైల్వే కు, ఆర్థిక శాఖకు, సేవా పన్నుల శాఖకు ఆర్టీఐ కింద 50 అర్జీలు పెట్టాడు. ఫలితంగా దిగొచ్చిన రైల్వే జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన 35 రూపాయలు తిరిగి వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించింది.
33 రూపాయలు చెల్లించిన రైల్వే.. మళ్ళీ 2రూపాయల కోసం మూడేళ్ళ పోరాటం
అయితే స్వామికి 35 రూపాయలు చెల్లించాల్సిన రైల్వే 2019 మే 1వ తేదీన ఆయన బ్యాంకు ఖాతాలో 33 రూపాయలు మాత్రమే జమ చేసింది. దీంతో మిగిలిన రెండు రూపాయల కోసం స్వామి మరో మూడేళ్లు పోరాటం చేసి విజయం సాధించారు. చివరకు ఆ రెండు రూపాయలను కూడా రైల్వే శాఖ ఆయన ఖాతాలో జమ చేసింది. స్వామి చేసిన పోరాటంతో మరో 2.98 లక్షల మందికి లబ్ధి చేకూరింది. జీఎస్టీ అమల్లోకి రాకముందు టికెట్ క్యాన్సిల్ చేసుకున్న 2.98 లక్షల మంది కూడా ఇదే తరహాలో తమ డబ్బును పోగొట్టుకున్నారు. ఇక వారందరికీ 35 రూపాయలు తిరిగి ఇచ్చేందుకు రైల్వే శాఖ దిగొచ్చింది. దీనికోసం మొత్తంగా 2. 43 కోట్ల రూపాయలను రైల్వే శాఖ రిఫండ్ చేస్తోంది.
పీఎం కేర్ ఫండ్స్ కి విరాళం.. పోరాటం సంతృప్తినిచ్చిందన్న వ్యక్తి
ఇక ఇదిలా ఉంటే వినియోగదారులందరికీ రూ. 35 వాపసు ఇవ్వటానికి అంగీకరించిన తరువాత, నా ఐదేళ్ల పోరాటానికి, ఏడాదికి రూ. 100 జోడించి, నేను ప్రైమ్ మినిస్టర్ కేర్స్ ఫండ్కి రూ. 535 విరాళంగా ఇచ్చాను అని స్వామి చెప్పారు. దాదాపు 50 ఆర్టిఐలు, రైల్వేలు, ఐఆర్సిటిసి, ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు సేవా పన్ను శాఖలకు లేఖలతో పోరాటం చాలా సుదీర్ఘమైనదని, అయితే చివరికి తనతో పాటు అప్పటి వినియోగదారులందరికీ 2.43 కోట్ల రూపాయలకు పైగా తిరిగి రావటం తనకు సంతృప్తిని ఇచ్చిందని స్వామి చెప్పారు.