రిగ్గింగ్ చేశారు.. జయలలిత ఎన్నిక చెల్లదు! : హైకోర్టులో పిటిషన్
చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఎన్నికను సవాల్ చేస్తూ.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. మొన్నటి ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి జయలలిత గెలుపొందగా.. ఆమె ఎన్నిక చట్టబద్దం కాదంటూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.
ఆర్కేనగర్ కు చెందిన ప్రవీణ అనే మహిళ ఈ పిటిషన్ ను దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించిన కోర్టు.. దీనిపై స్పందిస్తూ నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ దాఖలు చేసిన ప్రవీణ.. ఆర్కే నగర్ నియోజకవర్గంలో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బి.బాలమురుగన్ కుమార్తెగా సమాచారం.
పిటిషన్ లో ప్రవీణ పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. గత మే16న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగమంతా జయలలితకు మద్దతుగా ఆమె గెలుపు కోసం అధికారులంతా పనిచేశారన్నది ప్రధాన ఆరోపణ. ఎన్నికల వేళ అధికార పార్టీ పలు చోట్ల రిగ్గింగ్ కు కూడా పాల్పడిందని ప్రవీణ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని జయలలిత ఎన్నికను చెల్లదని ప్రకటించాలంటూ కోర్టుకు విన్నవించారు ప్రవీణ.
జయలలిత ఎన్నికను తిరస్కరించి.. ఆర్కే నగర్ స్థానానికి మళ్లీ ఎన్నిక నిర్వహించాలన్న అంశాన్ని పిటిషన్ లో ప్రవీణ ప్రస్తావించారు. కాగా, పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి ఎస్.దురైస్వామి దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల గడువు లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 16కు వాయిదా పడింది.