బీజేపీ ఎమ్మెల్యేలను కొందామా? రసవత్తరంగా మారిన కర్నాటక రాజకీయం..
Recommended Video
బెంగళూరు : కర్నాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్, జనతాదళ్కు చెందిన 14మంది ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమార స్వామి హుటాహుటినా బెంగళూరుకు తిరిగివచ్చారు. ఆ వెంటనే జనతాదళ్ శాసన సభాపక్షం, ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. 14మంది ఎమ్మెల్యేల కోసం రాజీనామా చేసే ప్రసక్తేలేదని కుమారస్వామి తేల్చిచెప్పారు.

బీజేపీ నేతలను కొనేద్దాం
తాజా పరిణామాల నేపథ్యంలో కుమారస్వామి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అసమ్మతి ఎమ్మెల్యేల్లో చాలా మంది రామలింగారెడ్డి సన్నిహితులే కావడంతో ఆయనను సముదాయించాలని నిర్మయించారు. బెంగళూరు నగర ఇంఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి డిప్యూటీ సీఎం పరమేశ్వరను తప్పిస్తే అసమ్మతివాదులు కొంతమేర శాంతించే అవకాశముందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సోమవారం కల్లా ఎమ్మెల్యేలు మనసు మార్చుకోకపోతే.. బీజేపీ నుంచి తనతో టచ్లో ఉన్న పది మంది ఎమ్మెల్యేలను కొనేద్దామని సీఎం ప్రతిపాదించినట్లు సమాచారం.

నేతలతో చర్చోపచర్చలు
ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో శనివారం బెంగళూరుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహాహాల ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ ఆదివారం బిజీగా గడిపారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, మంత్రి డి.కె. శివకుమార్ తదితరులతో చర్చోపచర్చలు జరిగాయి. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలను దారికి తెచ్చే బాధ్యతను ఆయన వారికే అప్పగించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో పలువురు సిద్ధరామయ్య సన్నిహితులు కావడంతో ఆయన మాట వింటారని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు.

సీఎంగా సిద్దరామయ్య
సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేస్తే రాజీనామా వెనక్కి తీసుకుంటామని సందేశం పంపారు. ఇదే విషయాన్ని డీకే శివకుమార్ జేడీఎస్ నేత దేవేగౌడకు వివరించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మద్దతిస్తామని చెప్పి మాటమార్చడం ఏంటని దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ సీఎంను మార్చాల్సి వస్తే మల్లిఖార్జున ఖర్గేకు మద్దతిస్తామని, సిద్ధరామయ్యను తెరపైకి తెస్తే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications