health tips: ఉదయం లేవగానే ఆరోగ్యం కోసం చెయ్యాల్సిన ఐదు ముఖ్యమైన పనులు ఇవే!!
ప్రస్తుత సమాజంలో అనుసరిస్తున్న జీవనశైలి అనేక రోగాలకు కారణంగా మారుతుంది. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండడం, ఉదయం నిద్ర లేవకుండా తొమ్మిది, పదింటి దాకా పడుకోవడం, తినవలసిన సమయాల్లో కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎలా పడితే అలా జీవించడం మన శరీరాన్ని రోగాలకుప్పగా మారుస్తుంది. ముఖ్యంగా రోగాల బారి నుండి బయట పడాలంటే ప్రతిరోజు తెల్లవారుజామున చేయవలసిన 5 ముఖ్యమైన పనులు ఉన్నాయి అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అవేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతిరోజూ ఉదయం ముందుగా చెయ్యాల్సిన పని ఇదే
ప్రతి రోజు మనం చేయవలసిన పనులలో మొట్టమొదటిది ప్రతి రోజూ ఆరు గంటల లోపు నిద్రలేవటం. ఖచ్చితంగా ఆరు గంటల లోపు నిద్ర లేచే అలవాటు ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తం గా చెబుతూ ఉంటారు. ఇక ఆ సమయంలో నిద్ర లేవడం వల్ల ప్రకృతిలో నిబిడీకృతమై ఉండే పాజిటివ్ ఎనర్జీ మనుషులకు వస్తుందని చెబుతారు. అందుకే ఉదయం కచ్చితంగా ఆరు గంటల లోపు నిద్ర లేవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని సూచిస్తున్నారు.
మంచంపై కూర్చునే ఈ పని చెయ్యండి
నిద్ర లేచిన తర్వాత చాలామంది వెంటనే మొబైల్ ఫోన్ పట్టుకుని వాట్సాప్ మెసేజ్ లు చూస్తూ ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. నిద్ర లేచిన వెంటనే అలాగే మంచం పైన ప్రశాంతంగా కూర్చుని ఓ 5 నిమిషాలపాటు ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఏకాగ్రత పెరుగుతుందని, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
కాఫీలు, టీలకు బదులు ఇవి తాగండి చాలు
ఆ తర్వాత వెంటనే చేయవలసిన పని కూర్చుని మంచినీళ్లు తాగడం అని చెబుతున్నారు. చాలామంది నిద్ర లేవగానే బెడ్ కాఫీ, బెడ్ టీలు తాగుతూ ఉంటారు. ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదని, ఆరోగ్యవంతుల లక్షణం కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా ఉదయం నిద్ర లేవగానే కొద్దిసేపు ధ్యానం చేసుకున్న తరువాత కూర్చుని ప్రశాంతంగా మంచినీళ్లు తాగాలని చెబుతున్నారు. మన నిద్రావస్థ నుంచి మేలుకున్నప్పటికి, మన కడుపు నిద్రావస్థ దశలోనే ఉంటుందని, దానిని ఆక్టివ్ చేయడం కోసం మంచి నీళ్లు తాగాలి అని సూచిస్తున్నారు.
ఉదయం ఈ పని చాలా ముఖ్యం
ఆ తర్వాత వెంటనే చేయవలసిన పని మలవిసర్జన అని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం క్రమ పద్ధతిలో ఒక సమయం ప్రకారం మలవిసర్జన జరిగితే వారు ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇక మలవిసర్జన చేయడానికి ఇండియన్ టాయిలెట్స్ ఎంతో మంచిదని సూచిస్తున్నారు. ఇండియన్ టాయిలెట్ లో మలవిసర్జన జరిగితే కడుపులోని పేగులు శుభ్రంగా మారతాయని చెబుతున్నారు. మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు వెస్ట్రన్ టాయిలెట్స్ ను ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు.
భూమాత అందించే శక్తిని తీసుకోవాలంటే ఈ పని చెయ్యండి
ఆ తర్వాత వెంటనే చేయవలసిన పని ఒక పది నిమిషాల పాటు భూమిపై మన పాదాలను ఆన్చి నిలబడడం కానీ, నడవడం కానీ చేయాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భూమిలో ఉండే ఎనర్జీ, మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుందని, మన శరీరం క్రమబద్ధంగా పని చేయడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. ఉదయాన్నే నిద్రలేవడం, ప్రశాంతంగా ఉన్న ప్రకృతిలోని శక్తిని తీసుకుని రీఛార్జ్ అవ్వడం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో ముఖ్యమైన అంశం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ పనులు దినచర్యగా చేస్తే కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటామని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.