ఏం ఎండలు బాబోయ్... జనం పిట్టలా రాలిపోతున్నారు...
సూర్యుడు సుర్రుమంటున్నాడు. నిప్పులు కురిపిస్తున్నడు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగనున్నాయి. వడగాలుల దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ తేడా లేకుండా సాధారణం కన్నా 4-7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలతో జనం అడుగు బయటపెట్టేందుకు జంకుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరితో పాటు రాయలసీమ జిల్లాల్లోని 139 మండలాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది.

50 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రత
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణపై వడగాలుల ప్రభావం అధికంగా ఉంది. అయితే రానున్న రోజుల్లో ఇవి మరింత పెరగనున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశముందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. ఉత్తర, వాయువ్య భారతదేశంలో ఈసారి ఉష్ణోగ్రతలు 50డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. తెలంగాణ, ఏపీపైనా వాటి ప్రభావం ఉంటుందని, అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరణాలు సంభవించే అవకాశమున్నందున, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం
ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల నుంచి ఉపరితల ద్రోణి ప్రభావంతో వడగాలుల తీవ్రత తగ్గింది. అయితే ఈ పరిస్థితి రెండు మూడు రోజుల వరకే ఉంటుందని, ఆ తర్వాత సూర్యుడు మళ్లీ విశ్వరూపం చూపిస్తానని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల వడదెబ్బకు గురై ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో నలుగురు, గుంటూరులో ఇద్దరు, విశాఖలో ఒకరు చనిపోయారు.

కోస్తాంధ్రకు వర్ష సూచన
విదర్భ పరిసరాల్లో ఆవర్తనం, దాని నుంచి కర్నాటక మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతోంది. దీనికి తోడు సముద్రం పై నుంచి గాలులు వీస్తుండటంతో బుధవారం కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురియనున్నాయి. ఫలితంగా కోస్తాంధ్ర ప్రాంతవాసులకు రెండు రోజుల పాటు ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. బుధ, గురు వారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈదురుగాలులు, వర్షాలతో పాటు కొన్ని చోట్ల పిడుగుల పడే ప్రమాదముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

పెరగనున్న ఎండల తీవ్రత
తెలంగాణలో ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. అవి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అంటోంది. రాష్ట్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ ప్రకటించింది. ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 47 నుంచి 48 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని, వడగాలులు మరింత పెరుగుతాయని అధికారులు చెప్పారు. మే నెలాఖరు వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications