ముంబైలో దంచికొడుతున్న వర్షాలు: ఆరెంజ్ అలెర్ట్ జారీ, అధికారులను అలెర్ట్ చేసిన మహారాష్ట్ర సీఎం!!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబై లోని రైల్వే ట్రాక్ లపై కూడా భారీ వర్షాల కారణంగా నీరు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
ముంబై లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలలో నీరు నిలవడంతో కొన్ని రూట్లలో బస్సులను దారి మళ్లించారు అధికారులు. వాహన చోదకులు భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . గత రాత్రి మరియు ఈ రోజు తెల్లవారుజామున ముంబై మరియు దాని శివారు ప్రాంతాలలో కురిసిన భారీ వర్షం తో చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సియోన్ రోడ్లు నీటితో నిండిపోయాయి. అంధేరీలో కూడా ప్రజలు మోకాళ్ల లోతు నీళ్ళలో నుండి వెళ్ళవలసిన పరిస్థితి కనిపిస్తుంది. నవీ ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల మధ్య ఖండేశ్వర్ రైల్వే స్టేషన్లోకి నీరు చేరింది.
ముంబై పశ్చిమ శివారు ప్రాంతంలో 116.73 మిమీ వర్షపాతం నమోదు
ముంబైకి లైఫ్ లైన్ గా పరిగణించబడే లోకల్ రైలు సర్వీసులు సెంట్రల్ రైల్వే మరియు వెస్ట్రన్ రైల్వే రూట్లలో సాధారణంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. వర్షాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో నగరంలో సగటున 95.81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే సమయంలో తూర్పు శివారు ప్రాంతంలో 115.09 మిమీ వర్షపాతం నమోదు కాగా, పస్చిమ శివారు ప్రాంతంలో 116.73 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ముంబై లో ఆరెంజ్ అలెర్ట్ .. ఐఎండీ హెచ్చరిక
భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం ముంబై మరియు దాని శివారు ప్రాంతాలలో "మోస్తరు నుండి భారీ వర్షాలు" కురుస్తాయని రాబోయే కొద్ది రోజుల పాటు వివిధ ప్రదేశాలలో "చాలా భారీ నుండి అత్యంత భారీ" వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలను నగరంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు. ముంబైలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఏకనాథ్ షిండే ఆదేశాలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్నాథ్ షిండే భారీ వర్షాల నేపథ్యంలో ముంబైతోపాటు పొరుగు జిల్లాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, సిఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనుకుమార్ శ్రీవాస్తవతో వరద పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు, అలాగే అన్ని సంబంధిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మరియు ప్రజలకు బాసటగా నిలవాలని, ముందు పరిస్థితులను నియంత్రించాలని సీఎం ఏకనాథ్ షిండే ఆదేశించారు" అని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.