ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం: వరదల్లోనే రోడ్లు, కూలిన చెట్లు, ఇళ్లు, విమానాలపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సోమవారం ఉదయం బలమైన గాలులు, భారీ వర్షం కురిసిన తర్వాత దేశ రాజధాని ప్రజలకు తీవ్రమైన ఎండల నుంచి పెద్ద ఉపశమనమే లభించింది. అయితే, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఢిల్లీ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం
వాతావరణంలో మార్పు తీవ్రమైన వేడి నుంచి ప్రజలకు ఊపిరి పోస్తుండగా, బలమైన గాలులు ఢిల్లీ, ఎన్సీఆర్లోని అనేక ప్రాంతాలలో చెట్లను నేలకూల్చాయి. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లు వరదనీటిలో మునిగాయి. ఏఎన్ఐ నివేదిక ప్రకారం.. గాలులతో కూడిన జల్లులు, బలమైన గాలులు కూడా ఎన్సిఆర్లో విద్యుత్ కోతలకు, ఆస్తి నష్టానికి కారణమయ్యాయి. పలు చోట్ల ఇల్లు కూడా కూలిపోయాయి.
50-80 కి.మీ వేగంతో ఈదురుగాలులు
రానున్న రెండు గంటల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. 'ధూళి తుఫాను/ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం, 50-80 కిమీ/గం వేగంతో ఈదురు గాలులు సోమవారం ఢిల్లీ-ఎన్సిఆర్, పరిసర ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉంది' భారత వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షంతో విమానాల రాకపోకలపై ప్రభావం
ఢిల్లీ, ఎన్సిఆర్లలో ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజిఐ) విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు సోమవారం ప్రభావితమయ్యాయి. నవీకరించబడిన విమాన సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థను సంప్రదించాలని విమానాశ్రయ అధికారులు ప్రయాణికులను అభ్యర్థించారు. కాగా, పలు విమానాలు తాత్కాలికంగా నిలిపివేయబడినట్లు సమాచారం.
ఢిల్లీ ప్రజలకు ఐఎండీ సూచనలు
హాని కలిగించే నిర్మాణాలు, కచ్చా గృహాలు, ట్రాఫిక్, విజిబిలిటీపై ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది. దేశ రాజధానిలో సోమవారం రాత్రి వరకు వర్షం కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంట్లోనే ఉండాలని, వీలైతే ప్రయాణానికి దూరంగా ఉండాలని సూచించారు. అంతకుముందు ఆది, శనివారం, దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది.