ముంబై ఎక్స్ప్రెస్ వే పై బండరాళ్లు- మూసుకుపోయిన టన్నెల్: బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్
ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వేపై భారీ వర్షాల కారణంగా తీవ్ర అవాంతరం ఏర్పడింది. ఖోపోలి-కుస్గావ్ పరిధిలోని 'మిస్సింగ్ లింక్' రహదారిపై ఉన్న రెండో సొరంగ మార్గం ఎగ్జిట్ వద్ద ఈ తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా పుణె నుంచి ముంబై వైపు వెళ్లే రహదారిని అధికారులు పూర్తిగా మూసివేశారు. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఆకస్మిక ఘటనపై మహారాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తక్షణమే స్పందించింది. హైవే ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఘటనా స్థలంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు కలగకుండా ఉండేందుకే ముందస్తు జాగ్రత్తగా ఈ ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఈ మార్గంలో ప్రయాణించవద్దని వాహనదారులను కోరారు.

సహ్యాద్రి పర్వత శ్రేణుల గుండా సాగే ప్రయాణ కష్టాలను తగ్గించడం కోసం ఈ 'మిస్సింగ్ లింక్' ప్రాజెక్టును నిర్మించారు. దాదాపు 13 కిలోమీటర్ల పొడవైన ఈ బైపాస్ రోడ్డును రెండు నెలల క్రితమే ప్రారంభించారు. ఈ రహదారి అందుబాటులోకి రావడం వల్ల ముంబై- పుణె నగరాల మధ్య ప్రయాణ దూరం ఆరు కిలోమీటర్ల మేర తగ్గింది. వాహనదారులకు సుమారు 25 నుండి 30 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
ఈ ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా ముంబై వైపు వెళ్లే వాహనాలన్నీ లోనావాలా వైపు మళ్లాయి. దీనివల్ల లోనావాలా సిటీ పరిధిలోని ఎక్స్ప్రెస్ వేపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. బంపర్-టు-బంపర్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెల్లవారుజామున 4 గంటల నుండి తాము లోనావాలా వద్దే చిక్కుకుపోయామని, వాహనాలు అంగుళం కూడా కదలట్లేదని వాహనదారులు వాపోతున్నారు. గంటల కొద్దీ జాతీయ రహదారి మీదే పడిగాపులు పడుతున్నారు.
మిస్సింగ్ లింక్ వద్దే కాకుండా.. ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వే సమీపంలోని ప్రసిద్ధ ఖండాలా ఘాట్ సెక్షన్ పరిధిలో కూడా ఈ భారీ వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావితమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక్కడ పలు చోట్ల రహదారిపైకి కొండచరియలు విరిగిపడ్డాయి. అలాగే వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవే కంట్రోల్ రూమ్ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కొండ ప్రాంతాల గుండా ప్రయాణించేటప్పుడు వేగ పరిమితిని పాటించాలని కోరుతున్నారు. వర్షం తీవ్రత తగ్గిన వెంటనే రోడ్డుపై పేరుకుపోయిన కొండచరియల శిథిలాలను పూర్తిగా తొలగించి, ముంబై మార్గాన్ని త్వరలోనే యథావిధిగా పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications