మోడీ అమెరికా పర్యటన షెడ్యూల్: రెండు సార్లు ట్రంప్తో భేటీకానున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ 74వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు బయలు దేరి వెళ్లారు. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు అమెరికాలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు భేటీల్లో పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకంటే ముందు ఆయన బిజీగా గడపనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన పూర్తి షెడ్యూల్ ఇలా ఉండనుంది. హూస్టన్ కాలమానం భారత కాలమానం కంటే 10:30 గంటలు వెనక్కు ఉంటుంది.

సెప్టెంబర్ 21, 2019:
భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11 గంటల 5 నిమిషాలకు హూస్టన్లోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీ ల్యాండ్ అవుతారు.
ఆదివారం తెల్లవారుజామున అంటే హూస్టన్లో శనివారం సాయంత్రం 6 గంటలకు మోడీ ఆయిల్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓల కార్యక్రమంలో పాల్గొంటారు. పలు ఆయిల్ సంస్థల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇందులో 16 ప్రముఖ ఆయిల్ కంపెనీల సీఈఓలు పాల్గొంటారు. ఇక అదేరోజు భారతకాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 6గంటల 5 నిమిషాలకు ఫోటో సెషన్లో పాల్గొంటారు. ఎన్ఆర్ఐలతో కాసేపు ముచ్చటిస్తారు.

సెప్టెంబర్ 22:
ఎన్ఆర్జీ స్టేడియంలో ట్రంప్తో కలిసి ఇండో అమెరికన్లను హౌడీ మోడీ ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు దాదాపు 50వేల మంది హాజరుకానున్నారు. ఇది భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమం హిందీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషలో ప్రసారం అవుతుంది. ఆ తర్వాత మోడీ ట్రంప్లు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సమావేశమై ఆ తర్వాత న్యూయార్క్కు బయలు దేరి వెళతారు.
సెప్టెంబర్ 23:
భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు వాతావరణంపై ఏర్పాటు చేసిన క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో ప్రధాని పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని యూఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరర్స్ హోస్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరర్స్ ఏర్పాటు చేసిన యూనివర్శల్ హెల్త్ కవరేజ్లో కార్యక్రమంలో మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఆయుష్మాన్ భారత్ గురించి వివరిస్తారు. దీని తర్వాత ఉగ్రవాదంపై జరిగే చర్చలు భాగస్వామి అవుతారు. ఈ కార్యక్రమాన్ని జోర్డాన్ రాజు, ఫ్రాన్స్ అధ్యక్షుడు, న్యూజిలాండ్ ప్రధానిలు హోస్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కెన్యా ఇండోనేషియా అధ్యక్షులు, యూకే ప్రధాని, జర్మన్ ఛాన్సెలర్లు అటెండ్ అవుతారు.

సెప్టెంబర్ 24:
ఇండియా పసిఫిక్ ద్వీపాల దేశాలకు చెందిన నాయకులతో భేటీ.. ఆ తర్వాత ఆంటోనియో గుటెరర్స్ ఇచ్చే విందులో పాల్గొంటారు. ఆ తర్వాత యూఎన్లోని భారత బృందం ఏర్పాటు చేస్తున్న మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరర్స్ పాల్గొంటారు. గాంధీ సోలార్ పార్క్, గాంధీ పీస్ గార్డెన్, ఐక్యరాజ్యసమితి పోస్టల్ స్టాంపులను విడుదల చేస్తారు. అనంతరం తన నాయకత్వ పటిమకు, స్వచ్ఛ్ భారత్ కోసం చేసిన కృషిని గుర్తిస్తూ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ గ్లోబల్ గోల్ కీపర్స్ అవార్డును ప్రధాని మోడీకి అందజేయనుంది.
సెప్టెంబర్ 25:
బ్లూమ్బర్గ్ బిజినెస్ ఫోరంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.ఆ తర్వాత పెట్టుబడులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఇందులో 40 కంపెనీల సీఈఓలు పాల్గొంటారు. ఈ భేటీ అనంతరం కరేబియన్ దీవులకు చెందిన నేతలతో సమావేశమవుతారు. రెండు గంటల పాటు ఈ సమావేశం జరుగుతుంది.
సెప్టెంబర్ 26:
పలు దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి.అయితే ఇంకా ఆ భేటీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
సెప్టెంబర్ 27
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. ఇది భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు జరుగుతుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ప్రసంగించడం ఇది రెండో సారి అవుతుంది. తొలిసారిగా 2014లో ఆయన ప్రసంగించారు.












Click it and Unblock the Notifications