నాగాలాండ్ ఘటన పొరబాటే-నెల రోజుల్లో సిట్ దర్యాప్తు చేయిస్తాం-అమిత్ షా ప్రకటన
నాగాలాండ్ లో భద్రతా బలగాలు తీవ్రవాదులుగా పొరబాటు పడి 16 మందిని కాల్చి చంపిన ఘటనపై పార్లమెంటు ఇవాళ దద్దరిల్లింది. కేంద్రం ప్రకటన కోసం విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో మధ్యాహ్నం భోజన విరామం తర్వాత లోక్ సభలో హోంమంత్రి అమిత్ షా దీనిపై ప్రకటన చేశారు.
అమిత్ షా ప్రకటన ప్రకారం... నాగాలాండ్ లోని ఓటింగ్లో ఉగ్రవాదుల కదలికలపై ఆర్మీకి సమాచారం అందింది. దాని ఆధారంగా అనుమానిత ప్రాంతంలో 21 మంది కమాండోలు మెరుపుదాడి చేశారు. ఒక వాహనం అక్కడికి చేరుకోగా, దానిని ఆపమని సిగ్నల్ ఇచ్చినా అది పారిపోయేందుకు ప్రయత్నించింది. ఉగ్ర వాదుల వాహనంపై అనుమానంతో కాల్పులు జరిపారని అమిత్ షా తెలిపారు.
వాహనంలో ఉన్న 8 మందిలో 6 మంది చనిపోయారని, ఇది పొరపాటున గుర్తింపు కేసుగా గుర్తించబడిందని అమిత్ షా వెల్లడించారు. గాయపడిన మరో ఇద్దరిని సైన్యం సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారన్నారు ఈ వార్తను అందుకున్న స్థానిక గ్రామస్థులు ఆర్మీ యూనిట్ను చుట్టుముట్టారని,, 2 వాహనాలకు నిప్పంటించారని అన్నారు. అలాగే భద్రతా బలగాలపై దాడి కూడా చేశారని అమిత్ షా ప్రకటించారు.
స్ధానికుల దాడి ఫలితంగా, భద్రతా దళాలలో ఓ జవాన్ మరణించాడని, పలువురు జవాన్లు గాయపడ్డారని తెలిపారు. ఆత్మరక్షణ కోసం, గుంపును చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరపాల్సి వచ్చిందని షా వెల్లడించారు. దీనివల్ల 7 గురు పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని తెలిపారు. స్థానిక నిర్వాహకులు-పోలీసులు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించారని అమిత్ షా పేర్కొన్నారు. నాగాలాండ్ ఘటన పొరబాటున జరిగింది మాత్రమేనని, భద్రతా బలగాలు స్వీయరక్షణకే కాల్పులు జరపాల్సి వచ్చిందని అమిత్ షా తెలిపారు. అయినప్పటికీ ఈ ఘటనపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నామని, నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇచ్చేలా చూస్తామని అమిత్ షా వెల్లడించారు.