పరువు హత్య: కన్న కూతుర్ని సజీవ దహనం చేసిన తల్లి
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరువు పోతుందనే నెపంతో ఓ తల్లి తన కన్నకూతురినే సజీవ దహనం చేసింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలోని అమీర్పూర్ గ్రామానికి చెందిన నీరజ్ కుమారి(20) అనే యువతిని ఆమె తల్లి, సోదరుడు దారుణంగా హత్య చేశారు.
తమకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించిందన్న కారణంగా పరువు కోసం యువతిని సజీవ దహనం చేశారు. మృతురాలి తల్లి మోహర్ దేవి, సోదరుడు ప్రమోద్, యువతి ప్రేమించిన యువకుడు అజయ్లను అదుపులోకి తీసుకొని విచారణ జరపుతున్నట్లు ఎస్ఎస్పీ మాంఝీ తెలిపారు.
అజయ్ కుమార్ని నీరజ్ కుమారి ప్రేమించడం ఇష్టంలేదని, అందుకు ఆమెను కాల్చి చంపామని బాధితురాలి తల్లి, సోదరుడు పోలీసుల ముందు అంగీకరించాడు.
కాశ్మీర్లో కూలిన హెలికాప్టర్: ఇద్దరు అధికారుల మృతి
కాశ్మీర్లో ఓ సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరు సైనికాధికారులు మృతి చెందారు. స్థానిక బందీపుర జిల్లాలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ స్థాయి అధికారి మృతి చెందారు. మానన్బల్లోని వైమానిక కేంద్రం నుంచి శిక్షణ నిమిత్తం బయల్దేరిన ధ్రువ్ హెలికాప్టర్ అనంతరం 30 నిమిషాల్లోనే నేలకొరిగినట్టు అధికారులు తెలిపారు.