కరోనా : లాక్ డౌన్పై సర్వే.. ఎంతమంది భారతీయులు పొడగింపును కోరుకుంటున్నారో తెలుసా?
లాక్ డౌన్ కారణంగా సమస్త జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దాదాపు నెల రోజులుగా ఇళ్లకే పరిమితం కావడంతో చాలామంది పనులు వాయిదా పడ్డాయి. కొంతమంది కుదురుగా ఇంట్లో కూర్చోలేక సతమతమవుతున్నారు. బోర్ కొట్టి బయటకు వెళ్దామంటే బయట లాఠీలు సిద్దంగా ఉంటాయి కాబట్టి చాలామంది ఆ రిస్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. నిజానికి లాక్ డౌన్ మొదట్లో చాలామంది కాస్త ఇబ్బందిపడినప్పటికీ.. ఆ తర్వాత అలవాటుపడిపోయారు. వైరస్ వ్యాప్తిపై అందరిలోనూ అవగాహన రావడంతో నిబద్దతతో లాక్ డౌన్ను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెర పైకి వచ్చిన ఓ పోల్ సర్వే ఇదే విషయాలను వెల్లడించింది.

ఎంతమంది లాక్ డౌన్ పొడగించాలనుకుంటున్నారు..
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో 88శాతం మంది భారతీయులు ఏప్రిల్ 14తో లాక్ డౌన్ను ముగించకుండా.. మరికొద్ది రోజులు పొడగిస్తే బాగుంటుందనుకుంటున్నారని వార్తా సంస్థ ఇన్షాట్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 40వేల మంది ఇన్షాట్స్ యాప్ యూజర్స్ నుంచి సమాచారం సేకరించి సర్వే వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం 92శాతం మంది యూజర్స్ కరోనా టెస్టింగ్ అనుమతులను ప్రైవేట్ ల్యాబ్స్కు కూడా ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

ఒడిశాలో ఇప్పటికే పొడగింపు
లాక్ డౌన్ కొనసాగిస్తేనే సోషల్ డిస్టెన్స్ పాటించే అవకాశం ఉంది కాబట్టి.. కరోనా నియంత్రణకు అంతకుమించిన మార్గం లేదని సర్వేలో చాలామంది అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం భారత్కు లాక్ డౌన్ను మించిన ఆయుధం లేదని.. లాక్డౌన్ను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరో అడుగు ముందుకేసి.. తమ రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అదే సమయంలో అన్ని విద్యాసంస్థలను జూన్ 17వరకు మూసే ఉంచుతామన్నారు. దేశంలో మరో 15 రోజులు లాక్ డౌన్ను పొడగించిన మొదటి రాష్ట్రం ఒడిశానే కావడం గమనార్హం.
Recommended Video

ఎప్పుడు స్పష్టత వస్తుంది...?
ఇటీవల అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ నెల 11న ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు.. లాక్ డౌన్పై అనుసరించాల్సిన వ్యూహాలను ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత లాక్ డౌన్ పీరియడ్ పొడగింపుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిజానికి లాక్ డౌన్ ఎత్తివేతపై కామన్ ఎగ్జిట్ స్ట్రాటజీ చెప్పాలంటూ ప్రధాని మోదీ ఇదివరకు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించడంతో.. లాక్ డౌన్ ఇక ఎత్తివేస్తారేమోనని చాలామంది భావించారు. కానీ కేసుల పెరుగుదల ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఆ సాహసం చేసే అవకాశం కనిపించట్లేదు.












Click it and Unblock the Notifications