lucky chance: ఎమ్మెల్యేగా ఓడిపోతే కేంద్రమంత్రి అయ్యాడు, ఎవరో కూడా తెలీని లీడర్, ఉప్పెనలా !
చెన్నై/న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్త ముఖాలు తెరమీదకు తెచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత పార్టీ నాయకులకే షాక్ ఇచ్చేశారు. కేంద్రంలో తనదైన ముద్రతో మంత్రివర్గ విస్తరణ చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త వారికి అవకాశం ఇచ్చి అందర్నీ ఆశ్చార్యానికి గురి చేశారు. బీజేపీ సీనియర్లను పక్కన పెట్టి మరి కొత్త ఎంపీలకు, ఎంపీలు కాని వారికి మంత్రి పదవులు ఇచ్చేశారు. తమిళనాడు నుంచి ఎవ్వరూ ఊహించని ఎల్. మురుగన్ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడంతో ఆ రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ నాయకులు షాక్ అయ్యారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మురుగన్ ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి అయిపోవడంతో ఆ రాష్ట్రంలోని కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఏడాది ఒక్కసారి వెలుగులోకి వచ్చిన మురుగన్ ఉప్పెనలా దూసుకుపోయి కేంద్ర మంత్రి అయిపోయారు.
Bumper offer: నక్కతోక తొక్కిన కర్ణాటక, నలుగురు మంత్రులు, మోదీ ఆశీర్వాదం, చాన్స్ అంటే ఇదే !
తమిళనాడులో ఊహించని పేరు
తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు ఎల్. మురుగన్ కు ఎవ్వరూ ఊహించని విదంగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఎల్. మురుగన్ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడంతో ఆ రాష్ట్రంలోని సీనియర్ బీజేపీ నాయకులు షాక్ అయ్యారు. తమిళనాడుకు చెందిన తమిళసై సౌందరాజన్ ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి ఇన్ చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పని చేస్తున్నారు. తమిళసై సౌందరాజన్ తరువాత అంతటి పేరు తెచ్చుకుంటున్న మురుగన్ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అయిపోయారు.
మొన్నటి వరకు తమిళ తంబీలకే మరుగన్ ఎవరో కూడా తెలీదు
తమిళనాడులో అణగారిన వర్గానికి చెందిన మురుగన్ గత ఏడాది ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. అప్పటి వరకు చాలా మంది తమిళ తంబీలకు మురుగన్ ఎంటే ఎవరు ?, ఆయన నేపథ్యం ఏమిటి ? అనికూడా సరిగా తెలీదు అనే టాక్ ఉంది. నమ్మక్కల్ జిల్లాకు చెందిన ఎల్. మురుగన్ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పాపులర్ అయిపోయారు.
ఉన్నత కులాలకు చెక్
తమిళనాడులో అగ్రకులాలకు చెందిన చాలా మంది బీజేపీలో ఉన్నా అణగారిన వర్గానికి చెందిన మురుగన్ కు అధ్యక్ష పదవి ఇచ్చిన బీజేపీ నాయకులు అందరికి షాక్ ఇచ్చారు. బీజేపీ అంటే అగ్రకులాల నాయకుల కోసమే అనే ఇమేజ్ ను భద్దలు కొడుతూ ఆరోజు బీజేపీ నాయకులు తీసుకున్న నిర్ణయానికి మురుగన్ పూర్తిగా న్యాయం చేశారని నిరూపించుకున్నారు.
ఉప్పెనలా దూసుకుపోయిన లీడర్
గత ఏడాది మురుగన్ తమిళనాడులో బీజేపీ పార్టీ తరపున ఓ యాత్ర చేపట్టారు. తమిళనాడులో మురుగన్ చేపట్టిన యాత్ర దెబ్బతో తమిళనాడు రాజకీయాలు కుదుపేశాయి. అప్పట్లో తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మిత్రపక్షం అయిన బీజేపీ చేపట్టిన యాత్రకు అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు కొందరు అభ్యంతరం చెప్పినా మురుగన్ ఏ మాత్రం పట్టించుకోకుండా 30 రోజుల పాటు తమిళనాడులో బీజేపీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి పార్టీకి మంచి పట్టు తీసుకు వచ్చారు.
చిత్తుగా ఓడిపోయినా..... ఆ నలుగురిని గెలిపించాడు
తమిళనాడులో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ నాయకులు పోటీ చేశారు. సీట్ల పంపకంలో పట్టువిడవకుండా అనుకున్న సీట్లు సాధించడంలో మురుగన్ అన్నాడీఎంకే పార్టీ మీద పైచెయ్యి సాధించారు. తిరువూర్ జిల్లాలోని తారాపురం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మురుగన్ చాలా తక్కువ ఓట్లు సాధించి చిత్తుగా ఓడిపోయారు. అయితే తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్, తిరునల్వేలి, నాగర్ కోవిల్, మోడక్కురిచి నియోజక వర్గాల్లో నలుగురు బీజేపీ అభ్యర్థులను గెలిపించుకున్న మురుగన్ ఆయన సత్తా ఏమిటో ఢిల్లీ పెద్దల ముందు నిరూపించుకున్నారు.
20 ఏళ్లకు అసెంబ్లీ ముఖం చూశారు
దాదాపుగా 20 ఏళ్ల తరువాత బీజేపీ నాయకులు తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్గడంతో ఒక్కసారిగా మురుగన్ ఢిల్లీ పెద్దల కళ్లల్లో పడ్డారు. మురుగన్ కు ఇంకా మంచి హోదా ఇస్తే తమిళనాడులో మనం ఇంకా పుంజుకుంటామని లెక్కలు వేసిన ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఇప్పుడు ఆయనకు ఏకంగా కేంద్ర మంత్రి పదవి ఇచ్చేశారు.
ఆరు నెలల్లో అలా జరగాలి..... అంతే !
మురుగన్ ప్రస్తుతం లోక్ సభలో కాని, రాజ్యసభలో కాని సభ్యుడు కాదు. ఎంపీ కాకుండా కేంద్ర మంత్రి పదవి కొట్టేసిన మురుగన్ ఆరు నెలల్లో కచ్చితంగా రాజ్యసభ సభ్యుడు కావాలి. తమిళనాడు నుంచి రాజ్యసభకు మురుగన్ ఎన్నిక కావడం సాధ్యం కాదని అక్కడి నాయకులే అంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి మురుగన్ రాజ్యసభలో అడుగుపెట్టడానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఎంపీ కాకుండా కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మురుగన్ తన సత్తా చాటుకుని త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టాలని ఎదురు చూస్తున్నారు.